
రెండవ అయోధ్యగా పిలుచుకునే భద్రాచలం రామయ్య దేవస్థానం అధికారులపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అత్యంత వైభవంగా.. భక్తిశ్రద్ధలతో శ్రీరామనవమి రోజు నిర్వహించే బ్రహ్మోత్సవాల పట్టాభిషేకం, కళ్యాణం వేడుకలకు భక్తులను అధికారులు ఇబ్బందులకు గురి చేశారు. స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా టికెట్లు వసూలు చేసి భక్తులను వివిఐపీ, వీఐపీలుగా విభజించారు.
స్వామివారికి సేవలను సమీపంలో ఉండి చూసుకునే భాగ్యం కలుగుతుంది కదా అని భక్తులు డబ్బులు వెచ్చించి టికెట్లు కొన్నారు. అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ, చత్తీస్ ఘడ్ రాష్ట్రాలకు సరిహద్దుగా ఉన్న ఈ మందిరంలోని వేడుకలను తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. కానీ ఏర్పాట్లు చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు.
స్వామివారి కళ్యాణ వేదిక భక్తుల సంఖ్యను అనుసరించి ఎత్తును పెంచాలి. అందరికీ కనిపించేలా ఏర్పాటు చేయాలి. కానీ గత సంవత్సరం కంటే తక్కువగా, కేవలం మూడు అడుగులల ఎత్తులోనే వేదిక ఏర్పాటు చేసి భక్తులకు రాములవారి కళ్యాణ దృశ్యాలను కనిపించకుండా చేశారు. దీంతో మూడు ప్రాంతాల నుంచి వచ్చిన రామయ్య భక్తులు అక్కడ ఏర్పాటు చేసిన స్క్రీన్ ల ద్వారా కళ్యాణం చూడాల్సి వచ్చింది.
అయితే ఇంత దానికి తాము వ్యయ ప్రయాసలకు ఓర్చి, టికెట్లు కొని టీవీలో చూడడానికైనా వచ్చింది ? అంటూ భక్తులు ఆరోపణలు చేస్తున్నారు. ఇలాంటి ఏర్పాట్లు ఉంటాయని ముందే తెలుసుకొని ఉంటే ఇంట్లోనే కూర్చుని టీవీల ద్వారా రామయ్య వారి కళ్యాణం తిలకించే వాళ్ళము. కానీ డబ్బులు వెచ్చించి టికెట్లు కొని, రవాణా చార్జీలు మోసుకుని అవస్థలు పడే వాళ్ళం కాదు కదా అని దేవాదాయ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాము టికెట్లు కొన్నది స్క్రీన్ లలో చూడడానికి కాదని, స్వామివారిని నేరుగా చూసి తరిద్దామని వచ్చామని పేర్కొంటూ ఆ అవకాశం ఇవ్వలేదు కాబట్టి తాము ఇచ్చిన టికెట్ రుసుము విషయంపై కోర్టుకు వెళ్లదలిచామని భక్తులు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఈవో, దేవాదాయ శాఖ కమిషనర్, భద్రాద్రి జిల్లా కలెక్టర్ ముగ్గురిపై కోర్టులో పిటిషన్ వేదల్చుకున్నారని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి వెల్లడించారు.
భక్తులకు సరైన వసతులు కల్పించలేక పోతే టికెట్లు ఎందుకు విక్రయిస్తున్నారని నిలదీస్తున్నారు. దేవుడి విషయంలో ఏం చేసినా భక్తులు సర్దుకుపోతారు అనే నిర్లక్ష్యం పనికిరాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెల్లించిన టికెట్లకు డబ్బులు తిరిగి ఇస్తారా? లేదా స్వామి వారిని దర్శనానికి మరో అవకాశం కల్పిస్తారా? కోర్టులోనే తెలుసుకుంటామని భక్తులు స్పష్టం చేస్తున్నారు.
కాగా, స్వామివారి కల్యాణానికి ఒక రోజు ముందు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన కోటి రూపాయల నిధులు ఎవరికి వచ్చాయి? వాటిని ఏం చేశారు? అనే విషయమై భక్తులు ఆరా తీస్తున్నారు. అసలు డబ్బులు ఇచ్చారా? ఇస్తే వాటిని వేటికి ఖర్చు చేశారు? అని సమాచార హక్కు చట్టం ద్వారా తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నారు.
హిందువుల పవిత్రమైన పండుగలకు ఓ తీరు.. ఇతర మతస్తుల పండుగలకు ఓ తీరుగా వ్యవహరించి, ఇలాంటి వివక్షకు గురిచేయడం ముఖ్యమంత్రికి తగదని భక్తులు బాహాటంగా చర్చించుకుంటున్నారు. దేవాదాయ శాఖ అధికారులు చేస్తున్న తప్పులను కోర్టులోనే తేల్చుకొని, వాటిని పునరావృతం చేయకుండా నిలదీస్తామని పేర్కొన్నారు.
More Stories
గాంధీజీ శాంతి, సహనం, సత్యం సందేశం మానవాళికి ప్రేరణ
మాలవీయ మిషన్ పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం
సుంకాల యుద్ధం మధ్య స్వదేశీ, స్వావలంబనలకై భగవత్ పిలుపు