అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవిపై మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు సిద్దరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ల మధ్య ఒక వంక ప్రచ్ఛన్న పోరు జరుగుతూ ఉండగా, తాజాగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే పేరును తెరపైకి తీసుకొస్తున్నారు. కేవలం సీఎం పోటీ నుండి సిద్దరామయ్యను తప్పించడం కోసమే శివకుమార్ వ్యూహాత్మకంగా ఖర్గే పేరు తీసుకొస్తున్నట్లు భావిస్తున్నారు.
కెపిసిసి చీఫ్ తాజాగా ఖర్గేను ‘దళిత సిఎం’పేరిట చర్చను తెరపైకి తీసుకురావడం, స్థానికత వర్సెస్ వలస అనే చర్చను పునరుజ్జీవింపచేయడం ద్వారా సిద్ధరామయ్య అవకాశాలను దెబ్బతీయాలనేది డికె ప్రయత్నంగా కొందరు కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. తను సిఎం అయితే ఖర్గే ఆధ్వర్యంలో పనిచేయడం ఇష్టమని, సీనియర్ నేత ఖర్గేకు గతంలో అన్యాయం జరిగిందని పార్టీనేతలే అంటున్నారని శివకుమార్చేసిన వ్యాఖ్యలు కర్ణాటక కాంగ్రెస్లో కలకలం రేపాయి.
అయితే, పార్టీ నిర్ణయమే అంతిమ నిర్ణయమని డికె స్పష్టం చేశారు. ఖర్గే “మా సీనియర్ నేత, ఎఐసిసి అధ్యక్షుడు ఖర్గే సిఎం పదవిని అడగలేదు. కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నదే ఆయన కోరిక” అని స్పష్టం చేశారు. సోమవారం ఆయన శృంగేరిలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ అంతా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని హితవు చెప్పారు. కాంగ్రెస్కు ఖర్గే సారథ్యం వహిస్తున్నారని చెబుతూ ఆయన సిఎం పదవి విషయాన్ని పార్టీకే వదిలేస్తున్నానని స్పష్టం చేశారు. సిద్ధరామయ్యా తదితరులు కూడా పార్టీకి కట్టుబడి ఉంటారని కూడా పేర్కొన్నారు.
కాగా కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పదవిని అధిష్ఠించాలని శివకుమార్, సిద్ధరామయ్య ఆశిస్తున్నారు. దీనిలో భాగంగా ఒకరిపై మరొకరు రాజకీయ ఎత్తుగడలతో తలమునకలయ్యారు. ఖర్గే సిఎం పదవిని అధిష్ఠించాలనుకుంటే రేసు నుంచి తప్పుకుంటానని శివకుమార్ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పడం గమనార్హం.
“ఖర్గే మా నాయకుడు, ఎఐసిసి అధ్యక్షుడు నాయకత్వంలో పనిచేయడం నాకు ఇష్టం. ఖర్గే రాష్ట్రానికి, దేశానికి ఆస్”తిగా డికె పేరొన్నారు. “ఖర్గే నాకంటే 20 ఏళ్ల సీనియర్, కాంగ్రెస్ చీఫ్. మేము ఆయన నాయకత్వానికి మద్దతు ఇవ్వకపోతే అనైతికం” అని కూడా హెచ్చరించారు. పార్టీ అధికారంలోకి రావడమే ముఖ్యమని, ముఖ్యమంత్రి ఎవ్వరో అన్నది కాదని చెప్పారు. శివకుమార్ ప్రకటనపై సిద్ధరామయ్య స్పందిస్తూ హైకమాండ్ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉంటారని పేర్కొన్నారు.
More Stories
ఢిల్లీ ఎన్నికల్లో 50 శాతం పైగా బూత్లు గెలవాలి
‘జాతీయ ఆరోగ్య మిషన్’ మరో ఐదేళ్లు పొడిగింపు
మంత్రులతో కలిసి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు