మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్ను సొంతం చేసుకున్నప్పటి నుండి మస్క్ మార్పులు చేస్తూనే ఉన్నారు. తాజాగా వినియోగదారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ట్విటర్ లోగో ”బ్లూబర్డ్” ను మార్చేశారు. దాని స్థానంలో డోజీకాయిన్కు సంబంధించిన ‘ డోజీ మీమ్‘ కనిపిస్తోంది. మంగళవారం ట్విటర్ను చూసిన వినియోగదారులు షాక్కు గురయ్యారు.
బ్లూబర్డ్ స్థానంలో డోజీ మీమ్ కనిపించడంతో అవాక్కయ్యారు. మొదట ట్విటర్ హ్యక్ అయిందేమోనని భావించారు. ఆ లోగోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై ట్విట్టర్ సిఇఒ ఎలన్ మస్క్ స్పందించారు. ట్విట్టర్ లోగోను మార్చేసినట్లు ధ్రువీకరించారు. ఇప్పుడు బ్లూ బర్డ్ పాతది అయిపోయిందని.. ఇకపై డోజీ మీమ్ ట్విట్టర్కు కొత్త లోగో అని వెల్లడించారు.
ఈ మేరకు ఫన్నీ మీమ్ను ఎలన్ మస్క్ షేర్ చేశారు. దీంతో పాటు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానంటూ మరో ట్వీట్ కూడా చేశారు. 2022 మార్చిలో మస్క్ ఒక ట్వీట్ చేశారు. ”భావప్రకటనా స్వేచ్ఛ సూత్రాలకు కట్టుబడి ఉండటంలో ట్విటర్ విఫలమైందని.. ఇప్పుడు ఏం చేయాలి” అని ప్రశ్నించారు. దీనికి ఒక నెటిజన్.. ట్విట్టర్ను కొనుగోలు చేసి.. బర్డ్ లోగోను డోజీతో రీప్లేస్ చేయండి అని సూచించాడు. దానికి సరే అన్నట్టు అప్పట్లో మస్క్ స్పందించాడు. తాజాగా ఈ చాటింగ్కు సంబంధించిన స్క్రీన్షాట్ షేర్ చేసిన మస్క్.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానంటూ ట్వీట్ చేశారు.
‘షిబా ఇనూ’ అనే జపాన్ జాతికి చెందిన కుక్క చిత్రాన్నే డోజీగా వ్యవహరిస్తుంటారు. 2013లో తొలిసారి డోజీకాయిన్ క్రిప్టోకరెన్సీకి, దానికి వెనక ఉండే బ్లాక్చైన్ సాంకేతికను జోక్ చేస్తూ ఈ డోజీని లోగోగా క్రియేట్ చేశారు. అప్పటి నుండి ఈ డోజీ అలాగే కొనసాగుతోంది. మస్క్ మొదటి నుండి డోజీకాయిన్కు మద్దతుగా నిలిచారు. గతంలో డోజీ కాయిన్ను ట్విటర్లో ప్రమోట్ చేసిన మస్క్ ఇప్పుడు ఏకంగా ట్విటర్ లోగోకి కూడా దానినే వినియోగించారు. దీంతో ఈ కాయిన్ విలువ ఒక్కసారిగా 22 శాతం పెరగడం గమనార్హం.
More Stories
జమ్మూకాశ్మీర్లో భారీ ఉగ్రదాడి.. ఎయిర్ఫోర్స్ కాన్వాయ్పై కాల్పులు
వన్డేలు, టీ20లో అగ్రస్థానంలో టీమ్ఇండియా
సర్వేల పేరుతో ఓటర్ల వివరాలు సేకరిస్తే చర్యలు