రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసులో ఒకవంక సిట్ విచారణ జరుగుతుండగానే హడావిడిగా రద్దయిన పలు పరీక్షల తాజా తేదీలను అధికారులు ప్రకటించడం పట్ల కలకలం రేగుతుంది. గ్రూప్1 ప్రిలిమ్స్ ను జూన్11న, ఏఈఈ పరీక్షను మే 8, 9, 21 తేదీల్లో నిర్వహిస్తామని వెల్లడించారు. ఏప్రిల్ 4న జరగాల్సిన హార్టికల్చర్ పరీక్షను జూన్17కు వాయిదా వేశారు.
టీఎస్ పీఎస్సీ అధికారులు, ఉద్యోగులపై ఆరోపణలు ఉండగా, ఇప్పుడు వాళ్లతోనే మళ్లీ పరీక్షలు ఎలా నిర్వహిస్తారని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఎవరిపైనా చర్యలు తీసుకోకుండా హడావిడిగా ఏర్పాట్లు చేయడమేంటని మండిపడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఒత్తిడితోనే కమిషన్ హడావిడిగా తేదీలను ప్రకటించిందనే విమర్శలు వస్తున్నాయి.
అధికారుల నిర్లక్ష్యం, సిబ్బంది తప్పుడు విధానాల కారణంగానే కాన్ఫిడెన్షియల్ డిపార్ట్ మెంట్ గా చెప్పుకునే టీఎస్పీఎస్సీ రోడ్డు మీద పడ్డది. కొందరు పలు రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్పేపర్లను అమ్మకానికి పెట్టినా కమిషన్ ఉన్నతాధికారులు గుర్తించలేకపోయారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్తోపాటు పలు పేపర్లు టీఎస్పీఎస్సీలోని చాలామంది ఉద్యోగుల చేతికి అందాయి. బయటి వ్యక్తులు ఫిర్యాదు చేసేంత వరకూ లీకేజీ వ్యవహారం కనిపెట్టలేకపోయారు.
టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకు పూనుకోకుండా వారితోనే తిరిగి పరీక్షలు జరిపించే ప్రయత్నం ఆందోళనకు దారితీస్తుంది. మరోవంక, ఇప్పటి వరకు పేపర్ లీకేజి జరిగిన తీరుపై దృష్టి సారించిన సిట్ ఇప్పుడు అసలు ప్రశ్న పాత్రల గోప్యత కాపాడే బాధ్యత ఎవ్వరిది? ఉన్నతాధికారులతో నిర్లక్ష్యం ఏమేరకు జరిగింది? అనే అంశాలపై దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తున్నది.
ఈ విషయమై కమిషన్ చైర్మన్ జనార్దన్రెడ్డిని విచారించేందుకు న్యాయసంబంధ అభిప్రాయాన్ని కూడా సిట్అధికారులు తీసుకున్నారు. ఒకట్రెండు రోజుల్లో కమిషన్లోనే ఆయనను ప్రశ్నించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. గ్రూప్1 పేపర్ ప్రిపరేషన్, పేపర్స్ కమిషన్కు వచ్చిన తర్వాత ఎవరి కస్టడీలో ఉన్నాయనే వివరాలను సేకరించనున్నట్లు సమాచారం. కేసుకు సంబంధించిన రిపోర్ట్ను ఈ నెల 11న కోర్టుకు సిట్ అందించనుంది.ఈ కేసులో అరెస్ట్ అయిన 15 మందిలో ఇప్పటికే 12 మందిని సిట్ అధికారులు కస్టడీకి తీసుకుని విచారించారు. ఏఈ పేపర్ లీకేజీలో ముగ్గురిని కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకోనున్నారు. కస్టడీలో నిందితులు ఇచ్చిన సమాచారం అధారంగా పేపర్ కస్టోడియన్ శంకరలక్ష్మి, టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్, కమిషన్ మెంబర్ లింగారెడ్డి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు.
ఈ క్రమంలోనే కమిషన్ చైర్మన్ జనార్దన్రెడ్డి వాంగ్మూలం కూడా తీసుకోనున్నారు. మాస్టర్ క్వశ్చన్ పేపర్స్ బాధ్యత ఎవరిదనే వివరాలతో స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నట్లు తెలిసింది. సెక్షన్ ఆఫీసర్ శంకరలక్ష్మి అయినప్పటికి కస్టోడియన్ ఎవరి నేతృత్వంలో పనిచేస్తున్నారని తెలుసుకోనుంది.
కాన్ఫిడెన్సియల్ సెక్షన్ యాక్సెస్ చైర్మన్ జనార్దన్రెడ్డి, శంకరలక్ష్మికి మాత్రమే ఉంటుందని విచారణలో సెక్రటరీ వెల్లడించినట్లు సమాచారం. దీంతో కస్టోడియన్ సెక్షన్ గురించి మరింత సమాచారాన్ని సేకరించేందుకు సిట్ చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలోనే చైర్మన్ను విచారించాలని నిర్ణయం తీసుకుంది. దానితో ఉన్నతాధికారులు బాధ్యత నుండి తప్పించుకోలేరనే ఆందోళన వెల్లడవవుతుంది.
గ్రూప్1 పేపర్ సహా అన్ని పేపర్స్కు సంబంధించిన మాస్టర్ పేపర్స్ శంకరలక్ష్మి కస్టడీలో ఉంటాయని ఇప్పటికే సిట్ నిర్ధారణకు వచ్చింది. శంకరలక్ష్మికి యాక్సెస్ ఉన్న కీ లాకర్ భద్రతపై చైర్మన్ ఎలాంటి చర్యలు తీసుకున్నారనే వివరాలను సేకరించే అవకాశాలు ఉన్నాయి.
లీకైన ప్రశ్నపత్రాలతో ఏఈ పరీక్ష రాసిన ప్రశాంత్రెడ్డి, రాజేందర్తోపాటు మీడియేటర్ తిరుపతయ్య కస్టడీపై కోర్టు తీర్పు వెలువడే అవకాశాలున్నాయి. ఈ ముగ్గురిని సిట్ కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. తిరుపతయ్య కాంట్రాక్టర్ కావడంతో తనకు తెలిసిన వారందరికి పేపర్ లీకేజీ విషయం చెప్పి ఉంటాడని సిట్ అధికారులు భావిస్తున్నారు. ఏఈ పేపర్ ఇంకా ఎంత మందికి చేరిందనే వివరాలను ఈ ముగ్గురి నిందితుల కస్టడీలో సిట్ రాబట్టనుంది.
More Stories
సిక్కుల ఊచకోత కేసులో కాంగ్రెస్ మాజీ ఎంపీ దోషి
హైదరాబాద్ శివాలయంలో మాంసపు ముద్దలు
అయోధ్య రామమందిరం ప్రధాన పూజారి కన్నుమూత