కేంద్ర నిధులు వినియోగిస్తూ.. కేంద్రంపైనే నిందలా?

అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన ప్రాంతాలలో పర్యటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు నష్టపరిహాన్ని ప్రకటించే క్రమంలో కేంద్ర ప్రభుత్వంపై నిందలు మోపడం పట్ల కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.  కేంద్ర ప్రభుత్వం ఎటువంటి సహాయం చేయడం లేదంటూనే.. రాష్ట్ర ఖజానా నుంచి కాకుండా, ఎస్‌డిఆర్‌ఎఫ్ (రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి) నుండి రైతులకు పంట నష్టపరిహారాన్ని అందిస్తామని చెప్పారని ఆయన ఎద్దేవా చేశారు.

ఎస్‌డిఆర్‌ఎఫ్‌లో 75 శాతం నిధులను కేంద్ర ప్రభుత్వమే సమకూరుస్తుందని చెబుతూ 2014-15 నుంచి ఇప్పటి వరకు రూ. 2,196.60 కోట్లను కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి విడుదల చేసిందని ఆయన స్పష్టం చేశారు.  మొత్తం రూ. 3,069.87 కోట్లు తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అందించిందని తెలిపారు.

2022 -23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మరో రూ.188.80 కోట్లను ఎస్‌డిఆర్‌ఎఫ్‌కు కేంద్ర ప్రభుత్వం జమ చేయనుందని అయన చెప్పారు. ఏప్రిల్ 2022 నాటికి రాష్ట్ర ఎస్‌డిఆర్‌ఎఫ్ అకౌంట్ నందు రూ. 608.06 కోట్ల నిధులు ఉన్నాయి. అంటే ప్రస్తుతం పంట నష్టపోయిన రైతులకు అవసరమైన సహాయాన్ని అందించటానికి సరిపడినన్ని నిధులు ఎస్‌డిఆర్‌ఎఫ్‌లో ఉన్నాయని కిషన్ రెడ్డి వెల్లడించారు.

 రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగానే రైతుల మీద ప్రేమ ఉంటే నష్టపోయిన రైతులకు ఎస్‌డిఆర్‌ఎఫ్ కింద ఇస్తున్న పరిహారంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి పరిహారం అందించాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు.

కేంద్రం ప్రవేశపెట్టిన ‘ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన’ పథకంలో మొదట్లో చేరిన తెలంగాణ ప్రభుత్వం, ఆ తర్వాత కారణాలేమీ చెప్పకుండానే ఈ పథకం నుంచి వైదొలిగిందని విస్మయం వ్యక్తం చేశారు. ఈ పథకం అమలవుతున్న రాష్ట్రాల్లో.. పంట నష్టపోయిన లక్షలాదిమంది రైతులు పరిహారాన్ని పొందుతున్నారని వెల్లడించారు.