గ్రూప్ 1 పేపర్‌ను చాలా మందికి పంపిణి

గ్రూప్ 1 పేపర్‌ను చాలా మందికి పంపిణి

టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీక్‌కు సంబంధించి రెండో రోజు నిందితుల సిట్ విచారణలో వాట్సాప్ చాట్‌లో కొత్త లింకులు వెలుగులోకి వచ్చాయి. రాజశేఖర్ మరికొందరికీ పేపర్ ఇచ్చినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఈ మేరకు వాట్సాప్ చాట్‌ను సిట్ రిట్రీవ్ చేసింది. ఈ క్రమంలో గ్రూప్ 1 పేపర్‌ను చాలా మందికి సర్క్యూలేట్ చేసినట్లు గుర్తించారు.

రాజశేఖర్, ప్రవీణ్, రేణుకలను విడివిడిగా అధికారులు విచారించారు. వీరి ముందు చాట్ డేటా పెట్టి ప్రశ్నలు సంధించారు. ప్రవీణ్ రాజశేఖర్‌లు కలిసే పేపర్ లీక్ చేసినట్లు ఈ సందర్భంగా గుర్తించారు. రెండు కంప్యూటర్లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు అధికారులు తరలించారు. అంతేకాకుండా ఐదు పేపర్లకు సంబంధించిన సమాచారాన్ని వాట్సాప్ చాట్‌లో గుర్తించారు అధికారులు.

ఇక, టిఎస్‌పిఎస్‌సి కార్యదర్శి పిఎ ప్రవీణ్, సిస్టమ్ అనలిస్ట్ రాజశే ఖర్‌లు గత అక్టోబరు నుంచే పలు పరీక్షలకు ప్రశ్నపత్రాలను కుట్ర పూరితంగా లీక్ చేసినట్లుగా సిట్ తేల్చింది. దీంతో సిట్ అధికారులు రాజశేఖర్, ప్రవీణ్‌ల వ్యక్తిగత కంప్యూటర్ నుంచి డాటాను రిట్రీవ్ చేశారు. రెండు కంప్యూటర్లను ఫారెన్సీక్ ల్యాబ్‌కి పంపించారు.

కమిషన్ కార్యాలయానికి చెందిన ఓ ఉద్యోగి యూజర్ ఐడీ, పాస్ వర్డ్ దొంగిలించడం ద్వారా ప్రశ్నాపత్రాలను పెన్ డ్రైవ్‌లో కాపీ చేసినట్టుగా రాజశేఖర్ చెప్పినప్పటికీ అందులో నిజం లేదని అధికారులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. అధికారుల దర్యాప్తును పక్కదారి పట్టించేందుకే నిందితులు ఈ విధంగా తప్పుడు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇలా ఉండగా, రద్దు చేసిన పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అందరికీ మళ్లీ రాసే అవకాశం టీఎస్​పీఎస్సీ కల్పించనుంది. ప్రశ్నపత్రాలల లీకేజీ వ్యవహారంతో ఇప్పటికే ఏఈ, ఏఈఈ, గ్రూప్​1, డీఏవో పరీక్షలను కమిషన్ రద్దు చేసింది. గ్రూప్​1 ప్రిలిమ్స్​ను జూన్​11న నిర్వహించనున్నట్లు ప్రకటించింది.