
ఈ ఏడాది జనవరి నెలలో రూ. 51 లక్షల కోట్ల విలువైన 1,50 కోట్ల డిజిటల్ చెల్లింపుల లావాదేవీలు దేశంలో జరిగాయని, మన డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉందో ఇది తెలియజేస్తుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. చెల్లింపుల వ్యవస్థలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేజ్ (యూపీఐ) ఒక విప్లవం తెచ్చిందని ఆయన తెలిపారు.
జనవరిలో జరిగిన డిజిటల్ చెల్లింపులలలో యూపీఐ ద్వారా రూ.13 లక్షల కోట్ల విలువైన 803 కోట్ల లావాదేవీలు ప్రాసెస్ అయ్యాయని వెల్లడించారు. చెల్లింపు వ్యవస్థ ఆపరేటర్లు, ప్రభుత్వం కృషి వల్లే ఇది సాధ్యపడిందని చెబుతూ, దీని ఫలితంగా గ్లోబల్ పేమెంట్స్ రంగంలో రిజర్వ్ బ్యాంక్ స్టార్ హోదా సంపాదించుకోలిగిందని దాస్ తెలిపారు.
కొచ్చిలో పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్ల (పీఎస్ఓ) కాన్ఫరెన్స్లో ఆర్బీఐ గవర్నర్ పాల్గొంటూ భారత్ లో చెల్లింపుల స్వరూపమే మారిపోయిందని, అత్యాధునికంగా సాగుతోందని దాస్ చెప్పారు. మన తాజా పేమెంట్స్ సిస్టమ్ అందుబాటులో ఉండటమే కాకుండా, సౌకర్యవంతంగానూ, వేగంగానూ, భద్రంగానూ కూడా ఉందని పేర్కొన్నారు.
దేశంలో సుమారు 114 కోట్ల మొబైల్ ఫోన్ కనెక్షన్లున్నాయని, ఇందులో 55 శాతం వాటా పట్టణ ప్రాంతాలదైతే, మిగిలిన 45 శాతం గ్రామీణ ప్రాంతాలదని ఆర్బీఐ గవర్నర్ చెప్పారు. మొబైల్ ఫోన్ల వాడకం పెరగడంతోపాటు, ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రావడం డిజిటల్ పేమెంట్ల జోరు ఎక్కువవడానికి దారితీసిందని వివరించారు.
బ్యాంకు బ్రాంచీల వర్కింగ్ అవర్స్తో సంబంధం లేకుండా ఎనీటైమ్..ఎనీవేర్ బ్యాంకింగ్ సాధ్యమవుతోందని పేర్కొన్నారు. డేటా విడుదలలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పారదర్శకంగా వ్యవహరిస్తోందని, ఎలాంటి చర్యలు తీసుకుంటోందనేది కూడా ఎకో సిస్టమ్లోని వారికి తెలుస్తోందని ఆయన చెప్పారు.
నగదు తక్కువగా ఉండే సమాజం వైపు చురుగ్గా కదలాలనేదే దీని వెనక ఉన్న ఉద్దేశమని దాస్ తెలిపారు. ఇదే సమయంలో పేమెంట్ సిస్టమ్స్ ఆరోగ్యకరంగానూ ఉండేలా చూస్తున్నామని చెప్పారు. రెగ్యులేటరీ వ్యవస్థ తీసుకునే చర్యలను వెంటనే పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్లు (పీఎస్ఓ) అమలులోకి తేవాలని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఈ సందర్భంగా సూచించారు.
కలిసి పనిచేద్దాం….పేమెంట్స్ ఎకోసిస్టమ్ అందరికీ కలిసొచ్చేలా చూద్దామని పీఎస్ఓలకు దాస్ పిలుపునిచ్చారు. 2018 మార్చిలో తెచ్చిన డిజిటల్ పేమెంట్ ఇండెక్స్ సెప్టెంబర్ 2022 నాటికి 377.46 పాయింట్లకు చేరిందని దాస్ వెల్లడించారు. మొదలు పెట్టినప్పుడు ఈ ఇండెక్స్ బేస్ 100 పాయింట్లని చెప్పారు. మనం చాలా దూరం ప్రయాణించామనడానికి ఈ ఇండెక్స్ నిదర్శనంగా నిలుస్తుందని చెప్పారు.
డిజిటల్ పేమెంట్లు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో యూజర్లకు వచ్చే సమస్యలూ అలాగే పెరుగుతున్నాయని, ముఖ్యంగా సైబర్ సెక్యూరిటీ, డేటా ప్రైవసీ, ఆపరేషనల్ ఇష్యూస్ ఇందులో ఉన్నాయని అన్నారు. కొత్తగా రాబోయే సవాళ్లకు ధీటైన రిస్క్మిటిగేషన్ చర్యలను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవాలని పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్లకు ఆయన సలహా ఇచ్చారు. మన సొంత పేమెంట్ ప్రొడక్టులైన యూపీఐ, రూపే నెట్వర్క్లు ఇప్పుడు గ్లోబల్ లెవెల్కు ఎదిగాయని, విదేశాలలో సైతం విస్తరిస్తున్నాయని దాస్ తెలిపారు.
More Stories
జమ్ముకశ్మీర్లో 12 మంది పాక్ చొరబాటుదారులు కాల్చివేత
రామ జన్మభూమిలో తొలి `కరసేవక్’ కామేశ్వర చౌపాల్ మృతి
ఐదేళ్లలో తొలిసారి వడ్డీ రేట్లు తగ్గింపు