పాకిస్థాన్‌లో తీవ్రస్థాయిలో హక్కుల ఉల్లంఘనలు

పాకిస్థాన్‌లో తీవ్రస్థాయిలో మానవ హక్కుల ఉల్లంఘనలు, భావ వ్యక్తీకరణకు విఘాతాలు ఏర్పడుతున్నాయని అమెరికా చట్టసభ ప్రముఖుడు బ్రాడ్ షెర్మాన్ ఆందోళన వ్యక్తం చేశారు. పాకిస్థాన్ ప్రభుత్వం ఇకనైనా దేశంలో చట్టాల పాలన, మాట్లాడే స్వేచ్ఛకు అనువైన వాతావరణం కల్పించాల్సి ఉందని స్పష్టం చేశారు.

ఈ పలుకుబడిగల చట్టసభ సభ్యులు, సభలో విదేశీ వ్యవహారాల కమిటీ సీనియర్ అయిన బ్రాడ్  వెలువరించిన వీడియో ప్రకటనను పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ తమ ట్విట్టర్‌లో జతపర్చారు. హక్కులను కాలరాస్తున్నారని, దీని వల్ల తలెత్తుతున్న పరిణామాల గురించి స్పందించే వారిని అణచివేస్తున్నారని ఎంతకాలం ఈ విధంగా సాగదీస్తారు? అని ప్రశ్నించారు.

ఇప్పటి పరిణామాల నడుమ దేశంలోని ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆధ్వర్యపు ప్రభుత్వానికి స్పందించాల్సిన కనీస బాధ్యత లేదా అని బ్రాడ్ ఘాటుగా ప్రశ్నించారు. మానవ హక్కులను దెబ్బతీస్తూ వస్తున్న వారిపై ఇందుకు ప్రేరకులపై షరీఫ్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సి ఉందని పిలుపు నిచ్చారు. తాము ఎవరికి భయపడేది లేదని, హక్కుల ఉల్లంఘన సంబంధిత విషయాన్ని అన్ని వేదికల పై నుంచి ప్రస్తావిస్తామని డెమెక్రాటిక్ పార్టీ సభ్యులు అయిన బ్రాడ్ తెలిపారు. తాను అంతకు ముందు ఇమ్రాన్‌తో , పాకిస్థానీ ఫిలాన్‌థ్రోపిస్టు అసిఫ్ అహ్మద్‌ను కలిసినట్లు వివరించారు.

 పాక్, అమెరికా మధ్య సంబంధాలు ఇప్పటివి కావని, 1940 నుంచి కొనసాగుతూ వస్తున్నాయని, పలు ప్రాంతీయ, ప్రపంచ స్థాయి విషయాలపై ఇరుదేశాలు పలుసార్లు కలిసి పనిచేశాయని గుర్తు చేశారు. ఈ దశలో పాకిస్థాన్‌లో జరిగే పరిణామాలపై ప్రత్యేకించి మానవ హక్కులపై స్పందించడం అమెరికా బాధ్యత ఉందని పేర్కొన్నారు.

 కేవలం పాకిస్థాన్‌లోనే కాకుండా ప్రపంచంలో ఎక్కడ హక్కుల పట్ల అనుమానాలు ఉన్నా తాము స్పందిస్తామని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని, హక్కులను పరిరక్షించడం అమెరికా విధి అని స్పష్టం చేశారు.