ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి, టీడీపీకి వేసే ఓటు వృద్దా

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి, టీడీపీకి ఓటు వేసి దుర్వినియోగం అవుతాయని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి హెచ్చరించారు.  ఆయన కర్నూల్ లో మాజీ రాజ్యసభ సభ్యులు పీజీ వెంకటేష్ తో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయమని కోరారు.

దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగిన ప్రజాస్వామ్యం పద్ధతిలో జరిగితే, ఏపీలోమాత్రం ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా జరుగుతుందని విమర్శించారు. టీడీపీ తమ నాయకులను పోటీలో పెట్టడానికి వెనకడుగు వేస్తుందని విమర్శించారు. టీడీపీ పార్టీ వైసీపీని ఎదురుకొనే స్థాయిలో లేదని చెబుతూ వైసీపీకి పోటీగా నిలిచే పార్టీ బీజేపీ పార్టీ మాత్రమే అని స్పష్టం చేశారు.

వైసీపీ పట్టభద్రుల ప్రలోభాలకు గురిచేస్తుందని విమర్శించారు. వైసీపీ నాయకుల అభివృధి పై మాట్లాడం లేదని, పైగా వార్తలు రాసిన జర్నలిస్ట్ ల‌పై ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేయడం విడ్డూరంగా ఉందని ధ్వజమెత్తారు. హై కోర్టు చెప్పినా జర్నలిస్టులపై కేసులు నమోదు చేశారని మండిపడ్డారు. సీఐ పై ఇప్పటివరకు ఎందుకు విచారణ చేయలేదని విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు.

ఏపీ హోమ్ మంత్రి ఈ ఘటన పై సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అధికారులు వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తే తమకు ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు వస్తాయని ఆలోచన చేస్తున్నారని చెప్పారు. కానీ ఈ విషయంలో ఎన్నికల కమిషన్ ఎందుకు ఈ ఘటన సుమోటోగా తీసుకోరని ప్రశ్నించారు.

ప్రజలు కట్టే పన్నులను జీతాలుగా తీసుకొని వైసీపీకి తొత్తులుగా పనిచేస్తున్నారని బిజెపి నేత విమర్శించారు. ఈ మధ్య రాష్ట్ర ముఖ్యమంత్రి బటన్ నొక్కి రైతుల ఖాతాలో డబ్బులు వేశారని, తమ మానిఫెస్టో లో 12,500 రైతులకు ఇస్తామని చెప్పారని పేర్కొంటూ  ఈ నాలుగు సం.కాలంలో ఎంత వేశారో శ్వేత పత్రం ఇవ్వాలనీ ఆయన ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు.

కేంద్రం ఇస్తున్న డబ్బులు కలిపి ఇస్తుంటే అందరికీ క్షమాపణ చెప్పి రూ. 24 వేలు ఇవ్వాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

సొంత మీడియాతో సీఎంల ప్రచారం

దేశంలోనే ఏపీ,తెలంగాణ,ఢిల్లీ ముఖ్యమంత్రులు తమ సొంత మీడియాతో ప్రచారం చేసుకుంటూ రాష్ట్రాలను బ్రష్టు పట్టిస్తున్నారని  మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ విమర్శించారు. ఎవరైనా ప్రతిపక్షం వాళ్ళు ప్రశ్నిస్తే వారి మీద సొంత మీడియాతో బూతులు ప్రచారం చేస్తున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిస్వార్ధంగా పనిచేస్తున్నటువంటి ప్రధానమంత్రిని కూడా ఇష్టానుసారంగా తిడుతూ తమ తమ రాష్ట్రంలో లబ్ధి పొందెందుకు ప్రయత్నించడం సిగ్గుచేటు మండిపడ్డారు.

రాష్ట్రాల అభివృద్ధిని పక్కన పెట్టి అధికారం నిలుపుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారనీ వెంకటేష్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతం అభివృద్ధిలో పూర్తిగా వెనుకబడిందని పేర్కొంటూ నాలుగు సంవత్సరాల కాలంలో రాయలసీమ ప్రాజెక్టులకు ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి ఇస్తున్నటువంటి నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం పక్కకు మళ్లిస్తూ అభివృద్ధిని విస్మరిస్తోందని దుయ్యబట్టారు.