ఉక్రెయిన్ -ర‌ష్యా యుద్దం ఆగిపోవాల‌ని రష్యన్ల పూజ‌లు

ఉక్రెయిన్ ..రష్యా యుద్ధం ఆగిపోవాలని రష్యా నుంచి భారత్‌కు వచ్చిన 24 మంది రష్యన్ల బృందం హరిద్వార్ చేరుకుని ప్రార్థనలు చేశారు. కంఖాల్‌లోని రాజ్‌ఘాట్‌లో గంగా పూజ చేశారు. రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య కాల్పుల విరమణ జరగాలని మొక్కుకున్నారు. రష్యన్లు హిందువుల ఆచారం ప్రకారం పూజించడం ఇక్కడ విశేషం.
వారు 11 రోజుల పాటు యజ్ఞం(హవన్), గంగా పూజలు నిర్వహించడం గమనార్హం. గంగానదిలో పవిత్ర స్నానం చేసి, హిందూ ఆచారాల ప్రకారం ప్రపంచ శాంతి కోసం ప్రార్థించారు. రెండు దేశాల్లో శాంతి నెలకొల్పేందుకు ఆయా దేశాల పౌరులు చేస్తున్న ప్రయత్నాలకు ఈ బృందం ప్రయత్నం అద్దం పడుతోంది.  ఈ పూజల కోసం రష్యా నుంచి ప్రత్యేకంగా వచ్చామని, హిందూ ఆచారాలపై నమ్మకంతో పాటిస్తున్నామని వారు తెలిపారు. అందుకే హరిద్వార్ లో పూజలు చేశామని రష్యన్ల బృందం నాయకుడు తెలిపారు.
 
గతేడాది ఫిబ్రవరి 24న రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలైంది. ఏడాది పూర్తయినా ఉక్రెయిన్ ను స్వాధీనం చేసుకోవడానికి రష్యా ఇంకా ప్రయత్నిస్తూనే ఉంది. కానీ యుద్ధం ఆగే సూచనలు కన్పించడంలేదు. ఇరు పక్షాలు మొండిగా సై అంటే సై అంటున్నాయి. ఈ కారణంగా ఇరు దేశ ప్రజలు తల్లడిల్లిపోతున్నారు.
 
భారతీయ ప్రాచ్య విద్యా సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ ప్రతీక్ మిశ్రాపురి మాట్లాడుతూ సనాతన్ ధర్మాన్ని అనుసరిస్తున్న 24 మంది రష్యన్లు హరిద్వార్ చేరుకున్నారు. వారికి పవిత్ర గంగమ్మ తల్లిపై విశ్వాసం ఉంది. ఇదివరలో కూడా వారు గంగానదిని సందర్శించుకున్నారు. ఇప్పుడు కూడా వీరంతా గంగానది వద్దకు చేరకుని పూజలు, యజ్ఞం చేశారు. ఉక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధం ఆగాలని అందరూ కోరుకున్నారు ’అని వివరించారు.
 
రష్యా నుంచి వచ్చిన ఈ సమూహంలో ప్రొఫెసర్లు, వివిధ రంగాల ఇంజనీర్లు ఉన్నారు. వీరందరికి హిందూ దేశం మీద నమ్మకమే కాదు, సనాతన ధర్మంలో కూడా నమ్మకం ఉంది. వీరంతా భక్తి శ్రద్ధలతో హరిద్వార్‌లో గంగా నదిని ఆరాధించారు.