ఎమ్మెల్యేలకు ఎర కేసులో `సుప్రీం’లో కేసీఆర్ కు చుక్కెదురు

సుప్రీంకోర్టులో కేసీఆర్ ప్రభుత్వానికి షాక్ తగిలింది. బిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారంపై దాఖలైన పిటిషన్లను శుక్రవారం సుప్రీంకోర్టు విచారించింది. విచారణ పూర్తయ్యేంత వరకు ఎవరినీ అరెస్ట్ చేయకుండా సీబీఐకు ఆదేశాలు ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది.

సీబీఐని తాము నియంత్రించలేమని జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. సిబిఐ విచారణకు ఆదేశిస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై స్పందించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది.

కేసు వివరాల్లోకి వెళ్తే, ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారంపై దర్యాప్తును సీబీఐకి తెలంగాణ హైకోర్టు అప్పగించింది. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును తెలంగాణ ప్రభుత్వం ఆశ్రయించింది. సిబిఐ చేతిలోకి కేసు వెళ్తే… ఇప్పటి వరకు చేసిన విచారణ అంతా పక్కదారి పడుతుందని టీఎస్ ప్రభుత్వం తరపున సీనియర్ లాయర్లు సిద్ధార్థ లూత్రా, దుష్యంత్ దవేలు వాదనలు వినిపించారు.

ఈ కేసులో ఆధారాలన్నీ బిజెపికి వ్యతిరేకంగా ఉన్నాయని, ఈ నేపథ్యంలో కేసును సిబిఐ కి ఎలా అప్పగిస్తారని వాదించారు. కేసు పై వాదించేందుకు త‌న‌కు మరింత సమయం కావాలని కోరారు. మరోవైపు కేసులో కీలక ఆధారాలు లీక్ చేశారన్న విషయాన్ని ప్రతివాదుల తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన జస్టిస్ గవాయ్.. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఆధారాలను మీడియాకే కాదు.. జడ్జీలకు పంపారని అన్నారు. ఇరు పక్షాల వాదనల అనంతరం కేసు విచారణను ఈ నెల 27కు వాయిదా వేశారు.