భారతీయ సాహిత్యం- ఆధ్యాత్మికత వేర్వేరు కాదు

భారతీయ సాహిత్యం- ఆధ్యాత్మికత వేర్వేరు కాదని.. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం గుర్తించడం కూడా కష్టమేనని టైమ్స్ గ్రూప్ వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సమీర్ జైన్ తెలిపారు. ఢిల్లీలో శనివారం నిర్వహించిన టైమ్స్ లిటరేచర్ ఫెస్ట్‌లో సమీర్ జైన్ ప్రారంభ ముఖ్య ఉపన్యాసం చేస్తూ భారతీయ ఆధ్యాత్మిక గ్రంథాలను గొప్ప సాహిత్య రచనలుగా చదవాలని సూచించారు. ముఖ్యంగా యువత మన గ్రంథాలను చదివితే అందులోని మాధుర్యాన్ని విభిన్నంగా గుర్తించగలరని స్పష్టం చేశారు.
 
ఈ సందర్భంగా ప్రఖ్యాత కబీర్ దాస్, గురునానాక్ రచనలను సమీర్ జైన్ ఉటంకించారు. అలాగే, గొప్ప సూఫీ కవి రస్ఖాన్ రచనల్లో కనిపించే గాఢత్వాన్ని వివరించారు. తాను 9వ తరగతి చదవే రోజుల్లో చదవిన రస్ఖాన్ రచనలు ఇప్పటికీ తన చెవుల్లో మార్మోగుతున్నాయని వివరించారు.

ఈ సందర్భంగా ఓ బ్రిటిష్ చారిత్రకవేత్త చెప్పిన మాటల్ని సమీర్ జైన్ గుర్తు చేశారు. ‘‘మీరు మహాభారతం, రామాయణంను చరిత్రగా చదివితే పురాణగాథ (మైథాలజీ)లుగా అనిపిస్తాయి. అదే వీటిని పురాణాలుగా చదివితే ఇందులో చరిత్రను గుర్తించవచ్చు’’ అని బ్రిటిష్ చారిత్రకవేత్త చెప్పారని వివరించారు. తన వరకు సాహిత్యానికి, ఆధ్యాత్మికతకు మధ్య రేఖ ఎల్లప్పుడూ అస్పష్టంగా ఉంటుందని పేర్కొన్నారు.

అయితే, ఇది మతానికి సంబంధించిన విషయం కాదని సమీర్ జైన్ స్పష్టం చేశారు. చాలా మంది నాస్తికత్వాన్ని అనుసరిస్తారని పేర్కొంటూ ఆధ్యాత్మిక గ్రంథాలను కూడా సాహిత్యంగా చదివితే చాలా గొప్పగా ఆస్వాదించగలరని చెప్పడమే తన ఆలోచన అని అని తెలిపారు.  కార్యక్రమానికి వచ్చేసిన యువకులను ఉద్దేశించి సమీర్ జైన్ మాట్లాడుతూ.. యువతను విద్యావేత్తలుగా తీర్చిదిద్దే ‘విశ్వవిద్యాలయం’ పేరులో ‘విశ్వం’ ఉందని.. కానీ, వారికి విశ్వం గురించి సరిగా బోధించడం లేని అభిప్రాయపడ్డారు.

ప్రస్తుత విద్యా వ్యవస్థ కేవలం విద్యార్థిని ఉద్యోగిగా తీర్చిదిద్దే ఖార్ఖానాగా మారిందని విచారం వ్యక్తం చేశారు. వాస్తవానికి మనం నేర్చుకోవాల్సినది ఎంతో ఉంటుందని సమీర్ జైన్ తెలిపారు. రచనలను చదవి వదిలేయడం కంటే విస్తృతంగా అన్వేషించాల్సిన అవసరం ఉందని హితవు చెప్పారు.
ఒక మనిషి జననం- మరణంను సూర్యుడు ఉదయించడం- అస్తమించడంతో పోల్చవచ్చని.. ఈ వాక్యం తనను ఎప్పుడూ విస్మయపరుస్తూ ఉంటుందని సమీర్ జైన్ తెలిపారు. తన అనుభవంలో ఆధ్యాత్మిక గ్రంథాలతో పోలిస్ ఎంతో మంది గొప్ప వాళ్ల రచనలు పదునుగా లేవని అర్థమైందని చెప్పారు. తన స్కూల్, కాలేజీ రోజుల్లో మక్‌బెత్ (విలియం షేక్స్‌పియర్ నాటిక)ను అభ్యసించామని.. ఆ నాటకంలోని అనేక భాగాలు తనకు గుర్తు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. అయితే, ఇది ఆధ్యాత్మిక గ్రంథాలకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయని తెలిపారు.
 
అంటే పిల్లలు, యువత చదివే చాలా వరకు సాహిత్యాన్ని బలవంతపు వివరణలతో ఎక్కిస్తున్నారని అర్థమైందని సమీర్ జైన్ అభిప్రాయపడ్డారు. దీన్ని తప్పుబట్టడం తన ఉద్దేశం కాదని, అయితే, పిల్లలు, యువతకు ఆధ్యాత్మిక గ్రంథాలను సాహిత్యంగా పరిచయం చేస్తే.. వారి ఆలోచనల్లో అద్భుతమైన మార్పును చూడవచ్చని స్పష్టం చేశారు. అంతిమంగా వారు ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి మార్గం చూపినట్లవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.