ఏపీలో 75కు పెరిగిన పులుల సంఖ్య

ఆంధ్ర ప్రదేశ్ లోని అటవీ ప్రాంతాల్లో పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని . జాతీయ పులుల అంచనా నివేదిక, 2018-22 తేటతెల్లం చేసింది. ఈ నివేదిక ప్రకారం రాష్ట్రంలో పులుల జనాభా 47 నుండి 75కి పెరిగింది. అంటే గతంలో కంటే ఇది 69 శాతం పెరుగుదలగా నమోదైంది.  ఈ క్రమంలోనే అటవీశాఖాధికారులు రాబోయే నాలుగేళ్లలో పులుల సంఖ్య విపరీతంగా పెరగడానికి వీలుగా పులుల నివాసాలను మెరుగుపరుస్తున్నారు.
2022లో నాగార్జునసాగర్‌-శ్రీశైలం టైగర్‌ రిజర్వ్‌, పాపికొండ నేషనల్‌ పార్క్‌లో నిర్వహించిన జాతీయ పులుల గణన వాటి జనాభా లెక్కలను తేల్చింది. ఈ లెక్కల ప్రకారం నాగార్జునసాగర్‌-శ్రీశైలం టైగర్‌ఒ రిజర్వ్‌లో 73 పులులు ఉండగా, పాపికొండ నేషనల్‌ పార్క్‌లో రెండు పులులు ఉన్నాయని దీంతో రాష్ట్రంలో మొత్తం పులుల సంఖ్య 75కి చేరుకుందని వెల్లడించింది. 
రాష్ట్రంలో నాగార్జునసాగర్‌-శ్రీశైలం టైగర్‌ రిజర్వ్‌ జోన్‌ దాదాపు 3,528 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉండగా, పాపికొండ నేషనల్‌ పార్క్‌ 1,013 చ.కి.మీ.లో విస్తరించి ఉంది.  ఈఎన్‌ఎస్‌టీఆర్‌ భారతదేశంలోనే అతిపెద్ద టైగర్‌ రిజర్వ్‌ జోన్‌గా గుర్తింపు పొందింది. ఈ ప్రాంతంలో కలుపు మొక్కల ద్వారా పులుల సంరక్షణకు చర్యలు చేపట్టేలా అటీవీ అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు.
పులుల జనాభాలో ఇంత గణనీయమైన పెరుగుదల నమోదును చూసిన తరువాత అటవీ అధికారులు ఇప్పటికే ఉన్న పులుల జనాభాను కొనసాగించడంతోపాటు వాటి జనాభా పెరుగుదలను సులభతరం చేయడం అనే జంట లక్ష్యాలతో పులుల నివాస మెరుగుదల కార్యక్రమాన్ని రూపొందించారు.
 
అటవీ అధికారులు సాసర్‌ పిట్స్‌ వంటి నీటి వనరులను కూడా ఏర్పాటు చేయనున్నారు. అటవీ సరిహద్దు గ్రామాలలో మానవ నివాసాలలోకి పులులు రాకుండా నిరోధించడానికి ఇవి సహాయపడతాయని అధికారులు పేర్కొంటున్నారు. కట్టలు సేకరించే సమయంలో లోతైన అటవీ ప్రాంతంలో ఒక గ్రామస్థుడిపై పులి దాడి చేసిన సందర్భం మినహా, ఈ మధ్య కాలంలో ఎన్‌ఎస్‌టీఆర్‌లో మనుషులపై పులి దాడి జరిగినట్లు ఎక్కడా నమోదు కాలేదు.
 
అయితే, అక్కడక్కడా పులులు మానవ నివాసాలలోకి వెళ్లి పశువులపై దాడి చేసిన కొన్ని కేసులు నమోదయ్యాయి. అటవీశాఖాధికారులు ముఖ్యంగా ఎన్‌ఎస్‌టీఆర్‌లో అక్రమ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి ఎలక్ట్రానిక్‌ నిఘా ఉంచడంతోపాటు హాని కలిగించే ప్రాంతాల్లో రెగ్యులర్‌ ఫుట్‌ పెట్రోలింగ్‌ను చేపట్టడం ద్వారా యాంటీ-పోచింగ్‌ డ్రైవ్‌ను తీవ్రతరం చేయనున్నారు.