ఏపీకి రూ. 600 కోట్లతో మరో కొత్త జాతీయ రహదారి

 ఆంధ్ర ప్రదేశ్ లో ఇప్పటికే రాష్ట్రంలో ఆరు కొత్త హైవేల నిర్మాణానికి, 11 హైవేలకు జాతీయ హోదా తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో అనుమతులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో మరో కొత్త జాతీయ రహదారి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.
 
ఎన్‌హెచ్‌ బి 365 నిర్మాణానికి కేంద్ర అనుమతులు పూర్తిస్థాయిలో రావడంతో ఎన్‌హెచ్‌ఏఐ రహదారి నిర్మాణానికి సన్నాహాలు మొదలు పెట్టింది. తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం మీదుగా ఈ కొత్త జాతీయ రహదారి త్వరలోనే నిర్మాణం కానుంది. ఈ రహదారి ఏలూరు జిల్లా జీలుగుమిల్లి నుంచి బుట్టాయగూడెం, కన్నాపురం మీదుగా తూర్పు గోదావరి జిల్లా దొండపూడి, పోలవరం, తాళ్లపూడి, కొవ్వూరు మండలాలను అనుసంధానం చేస్తూ నిర్మాణం కానుంది.
 
మొత్తం 86.7 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణం ఎన్‌హెచ్‌ఏఐ చేపట్టనుంది. ఇప్పటికే దీనికి సంబంధించి భూ సేకరణ ప్రక్రియను కూడా పూర్తి చేశారు. 
ఈ రహదారి నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలకు పూర్తిస్థాయిలో అనుమతులు రావడంతో ప్రాజెక్ట్‌ త్వరలోనే పట్టాలెక్కనుంది. రానున్న రెండు నెలల్లో భూసేకరణ ప్రక్రియ ఒకవైపు పూర్తిచేస్తూనే ఈ గడువు లోగానే గ్రామాల వారీగా బాధితులకు పరిహారం చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
కొత్తగా నిర్మించనున్న రహదారికి సంబంధించిన ప్రణాళికలను ఎన్‌హెచ్‌ఏఐ సిద్ధం చేసింది. కొన్ని గ్రామాల్లో ప్రస్తుతం ఉన్న రోడ్లను జాతీయ రహదారులకు అనుగుణంగా పూర్తిస్థాయిలో వెడల్పు చేయడంతో పాటు ఆధునీకరించాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే మరికొన్ని గ్రామాల మీదుగా ఫ్లై ఓవర్లను నిర్మించేందుకు ప్రతిపాదనలను ఎన్‌హెచ్‌ఏఐ చేసింది.

స్థానికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సబ్‌వేలను నిర్మించనున్నారు. ఇప్పటికే ప్రభుత్వ భూమితో పాటు కొందరికి చెందిన ప్రైవేట్‌ భూములను ఎన్‌హెచ్‌ఏఐ సేకరించింది. మిగిలిన భూ ప్రక్రియ ముగియగానే ఇప్పటికే అనుమతులు పూర్తిస్థాయిలో లభించిన నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్‌ త్వరలోనే పట్టాలెక్కడం ఖాయంగా కనిపిస్తోంది.