పాక్ మసీదులో పోలీసు వేషధారణలో వచ్చి ఆత్మాహుతి దాడి!

పాకిస్థాన్‌లోని పెషావర్‌లో గల ఓ మసీదులో భద్రతా సిబ్బందే లక్ష్యంగా జరిగిన  ఆత్మాహుతి దాడిలో ఇప్పటి వరకు వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎక్కువగా పోలీసు సిబ్బందే ఉన్నారు. కాగా, మ‌సీదులో పేలుడు జ‌రిగిన స‌మ‌యంలో అక్కడ 400 మంది పోలీసులు గ‌స్తీలో ఉన్నారు. అయినప్పటికీ ఈ పేలుడు జరగడం తీవ్ర చర్చనీయాంశమైంది.
 
ఇంత హైసెక్యూరిటీని దాటుకుని సూసైడ్‌ బాంబర్‌ మసీదులోకి ఎలా చొరబడ్డారన్నది ప్రశ్నార్థకంగా మారింది. అయితే, సదరు సూసైడ్‌ బాంబర్‌ పోలీసు డ్రెస్‌లో తలకు హెల్మెట్‌ పెట్టుకుని మసీదులోకి చొరబడ్డట్లు అక్కడి అధికారులు తాజాగా వెల్లడించారు.
 
‘భద్రతా లోపం కారణంగా ఈ దాడి జరిగింది. సూసైడ్‌ బాంబర్‌ పోలీసు డ్రెస్‌ వేసుకుని ఉండటంతో సెక్యూరిటీ చెక్‌ వద్ద డ్యూటీలో ఉన్న వారు అతన్ని సరిగా చెక్‌ చెయ్యలేదు..’ అని ఖైబర్‌ ఫక్తుంఖ్వా ప్రావిన్స్‌ పోలీసు అధికారి మొజామ్‌ జా అన్సారీ తెలిపారు. యునైటెడ్ అరబ్‌ ఎమిరేట్స్‌ అధ్యక్షుడు పాకిస్థాన్‌లో సోమవారం పర్యటించాల్సిన సమయంలోనే ఈ ఉగ్రదాడి జరిగింది. దీంతో ఆయన పర్యటన రద్దయింది.
 
అతను పోలీసు డ్రెస్‌లో లోపలికి చొరబడినట్లు సీసీటీవీ ఫుటేజ్‌ ద్వారా వెల్లడైనట్లు చెప్పారు. మరోవైపు ఘటనాస్థలి వద్ద సూసైడ్‌ బాంబర్‌ తలను ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పెషావర్‌ నగరంలోగల హై సెక్యూరిటీ జోన్‌లో ఓ మసీదులో సోమవారం మ‌ధ్యాహ్నం ప్రార్థన‌లు జరుగుతున్న స‌మ‌యంలో ఈ పేలుడు సంభవించింది.
 
పెషావర్ నగర పోలీస్ అధికారి మహ్మద్ అజీజ్ ఖాన్ జియో టీవీతో మాట్లాడుతూ మసీదులో పేలుడు ఆత్మాహుతి దాడేనని, అనుమానిత ఫిదాయి తలను ఘటన స్థలిలో లభ్యమయ్యిందని చెప్పారు. మధ్యాహ్నం ప్రార్థనల సమయంలో మసీదులోకి పోలీసుల వాహనంలోనే వచ్చినట్టు భావిస్తున్నామని చెప్పారు.
సోమవారం మధ్యాహ్నం 1.40 గంటలకు మసీదులో భద్రతా సిబ్బంది సహా మరికొందరు ప్రార్థనలు చేస్తున్న సమయంలో ముందు వరుసలో ఉన్న గుర్తు తెలియని వ్యక్తి తనను తాను పేల్చుకున్నాడు. శక్తివంతమైన పేలుడు ధాటికి మసీదులోకి కొంత భాగం పూర్తిగా ధ్వంసమయ్యింది.
 
మృతి చెందిన 101 మందిలో 97 మందికి పైగా పోలీసులే ఉన్నారు. ఈ ఘటనలో 200 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వారంతా సమీపంలోని పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఘటనలో కనీసం ఐదుగురు సబ్‌ ఇన్‌స్పెక్టర్లు, మసీదుకు చెందిన మత గురువు మౌలానా షహీబ్‌జాదా నూరుల్‌ అమీన్‌ మరణించారు.
 
ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ.. ఉగ్ర ముఠా తెహ్రీక్‌-ఎ-తాలిబన్‌ పాకిస్థాన్‌ ప్రకటన చేసింది. గతేడాది ఆగస్టులో అఫ్గానిస్థాన్‌లోని తమ కమాండర్‌ ఉమర్‌ ఖలీద్‌ ఖురసానిని చంపినందుకు ప్రతీకారంగా ఈ దాడి చేసినట్లు ప్రకటించింది. 2007లో ఏర్పాటైన టీటీపీ కొన్నేళ్లుగా పాక్‌‌లో భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకొని దాడులకు తెగబడుతోంది.
 
 అల్‌ఖైదాతో సన్నిహిత సంబంధాలున్న ఈ ముఠా.. పాక్‌లోని తన కార్యకలాపాలను కొనసాగిస్తోంది. 2014లో పెషావర్‌లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్‌పై దాడికి పాల్పడి 131 మంది విద్యార్థుల సహా 150 మందిని పొట్టనబెట్టుకుంది.