ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఢిల్లీ సిఎం కేజ్రీవాల్, ఎమ్మెల్సీ కవిత

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో భాగంగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రెండో ఛార్జ్ షీట్ లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేర్లను ప్రస్తావించింది. అలాగే అభిషేక్ బోయినపల్లి, అమిత్ అరోరా, సమీర్ మహేంద్రు, శరత్ చంద్రా, విజయ్ నాయర్, బినోయ్ బాబు సహా మొత్తం 17 మంది నిందితులపై ఈడీ అభియోగాలు మోపింది.
 
ఢిల్లీ మద్యం కుంభకోణం నుంచి వచ్చిన డబ్బును ఆప్ గోవాలో ఎన్నికల ప్రచారానికి ఉపయోగించినట్లు ఈడీ స్పష్టం పేర్కొంది.ఈ కుంభకోణంలో లభించిన సొమ్ములో కొంత బాగాన్ని ఎన్నికల ప్రచారానికి ఆప్ ఉపయోగించిందని ఈ కేసుకు సంబంధించి దాఖలు చేసిన రెండవ చార్జిషీట్‌లో ఇడి గురువారం ఆరోపించింది.
ఆప్‌కు చెందిన సర్వే బృందాల కార్యకర్తలకు రూ. 70 లక్షలను నగదు రూపంలో చెల్లింపులు జరిగినట్లు ఇడి పేర్కొంది. గోవా ఎన్నికల ప్రచారంతో సంబంధం ఉన్న కొందరు వ్యక్తులకు నగదు చెల్లింపులు జరిపినట్లు ఆప్ కమ్యూనికేషన్ ఇన్‌చార్జ్ విజయ్ నాయర్ వెల్లడించినట్లు ఇడి తెలిపింది.  వైఎస్‌ఆర్‌సిపి ఎంపి మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు మాగుంట రాఘవ్, అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి, టిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవితతో కూడిన సౌత్ గ్రూపు నుంచి ఆప్ తరఫున విజయ్ నాయర రూ 100 కోట్లు ముడుపులుగా పుచ్చుకున్నారని ఇడి ఆరోపించింది.
ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సహాయకుడు దినేష్ అరోరాతో కుమ్మక్కై హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి అభిషేక్ బోయినపల్లి ఈ నగదు బదిలీ జరిపినట్లు ఇడి ఆరోపించింది. ఈ కేసులో అదనపు చార్జిషీట్‌ను ఇడి గురువారం రౌస్ అవెన్యూ కోర్టులో దాఖలు చేసింది.

అదనపు చార్జిషీట్‌లో నిందితులుగా విజయ్ నాయర్, శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబు, అభిషేక్ బోయిన్‌పల్లి, అమిత్ అరోరా పేర్లను ఇడి చేర్చింది. ఈ చార్జిషీట్‌లో ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా పేరును ఇడి పేర్కొనలేదు. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోందని ఇడి కోర్టుకు తెలియచేసింది.

ఆప్ తరఫున విజయ్ నాయర్ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఇండోస్పిరిట్స్ చైర్మన్ సమీర్ మహేంద్రు మధ్య వీడియో సమావేశాన్ని ఏర్పాటు చేశారని ఇడి ఆరోపించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీలో లైసెన్సుల కోసం అడ్వాన్సుగా సౌత్ గ్రూపు నుంచి రూ. 100 కోట్లు ఆప్ నాయకుల తరఫున విజయ్ నాయర్ అందుకున్నారని ఇడి ఆరోపించింది.

విజయ్ నా మనిషి..అతడిని మీరు నమ్మి మీరు ముందుకు సాగవచ్చు అని సమీర్ మహేంద్రుకు కేజ్రీవాల్ భరోసా ఇచ్చారని కూడా ఇడి తన చార్జిషీట్‌లో ఆరోపించింది. ఇలా ఉండగా ఇడి దాఖలు చేసిన అదనపు చార్జిషీట్‌పై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఇది పూర్తిగా కల్పితమని ఆయన అభివర్ణించారు.

రెండో ఛార్జి షీట్‌‌లో ఈడీ అధికారులు కేజ్రీవాల్, కవిత పేర్లను పలుమార్లు ప్రస్తావించింది. ఇప్పటివరకు ఆరుగురిని అరెస్టు చేసినట్లు ఈడీ తెలిపింది. ఢిల్లీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించామని వెల్లడించింది. మొత్తం 65 మందిని ప్రశ్నించామని, 100 కోట్లు చేతులు మారాయని తెలిపింది.
 
నిందితులు హైదరాబాద్, ఢిల్లీలో పలు హోటళ్ళలో సమావేశమయ్యారని, నిందితులతో కవిత ఢిల్లీ ఒబెరాయ్ మెడిన్స్‌లో, హైదరాబాద్ లోని ఆమె నివాసంలో సమావేశమయ్యారని ఈడీ తెలిపింది. హోల్‌సేల్ వ్యాపారంలో 12 శాతం లాభాలు రిటైల్ వ్యాపారంలో 185 శాతం లాభాలు వచ్చేలా మద్యం విధానంలో అక్రమాలు జరిగాయని ఈడీ వెల్లడించింది.