ఆస్ట్రేలియాలో హిందూ ఆలయాల ధ్వంసంపై భారత్ ఆగ్రహం

ఆస్ట్రేలియాలో హిందూ దేవాలయాలపై దాడులతో పాటు గోడలపై భారత వ్యతిరేక నినాదాలపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. హిందూ ఆలయాలపై దాడులకు తెగబడి ఖలిస్తానీ మద్దతుదారులు ధ్వంసం చేశారు. ఆ గోడలపై భారత్, ప్రధాని నరేంద్ర మోడీపై ద్వేషపూరిత నినాదాలు రాశారు. ‘‘హిందుస్థాన్ ముర్దాబాద్’’, ‘‘ఖలిస్థాన్ జిందాబాద్’’ వంటి భారతదేశ వ్యతిరేక నినాదాలతో ఆలయ గోడలపై లిఖించారు.
 
కారమ్ డౌన్స్‌లోని పురాతన శ్రీ శివ విష్ణు దేవాలయం, మెల్‌బోర్న్‌లోని బీఏపీఎస్ స్వామినారాయణ మందిరం, ఇస్కాన్ ఆలయాలపై దాడులు జరిగాయి. ‘‘విధ్వంసకులు భయంకర చర్యలు శిక్షార్హతమైనవి.. అలాగే భారత వ్యతిరేక ఉగ్రవాదులను కీర్తిస్తూ రాసిన నినాదాలు కూడా ఆందోళనకరంగా ఉన్నాయి’’ అని కాన్‌బెర్రాలోని భారత హైకమిషన్ ఓ ప్రకటనలో తీవ్రంగా ఖండించింది. 

ఈ సంఘటనలు శాంతియుత బహుళ విశ్వాసాలు, బహుళ-సాంస్కృతిక భారతీయ-ఆస్ట్రేలియన్ సమాజం మధ్య ద్వేషం, విభజనను నాటడానికి స్పష్టమైన ప్రయత్నాలని వ్యాఖ్యానించింది.  ‘‘ఆస్ట్రేలియాలో ఖలిస్థాన్ అనుకూల శక్తులు తమ కార్యకలాపాలను వేగవంతం చేస్తున్నాయని, సిక్కులు ఫర్ జస్టిస్ వంటి నిషేధిత తీవ్రవాద సంస్థల సభ్యులు, ఆస్ట్రేలియా వెలుపలి ఇతర విద్వేషపూరిత సంస్థల సహాయం, ప్రోత్సాహం లభిస్తున్నాన్నాయి’’ అని హైకమిషన్ ఆరోపించింది. నేరస్తులను న్యాయస్థానం ముందుకు తీసుకురావడమే కాకుండా తదుపరి ప్రయత్నాలను నిరోధించడానికి తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నామని పేర్కొంది.

అలాగే, నిషేధిత సంస్థ సిక్ ఫర్ జస్టిస్ ప్రకటించిన మెల్‌బోర్న్, సిడ్నీలలో వచ్చేవారం తలపెట్టిన ప్రజాభిప్రాయ సేకరణ అని పిలవబడే ఆందోళనలను కమిషన్ ప్రస్తావించింది. ఆస్ట్రేలియాలోని భారతీయులు, వారి ఆస్తుల భద్రతను నిర్ధారించాలని, భారతదేశం ప్రాదేశిక సమగ్రత, భద్రత, జాతీయ ప్రయోజనాలకు హానికరమైన కార్యకలాపాలకు ఆస్ట్రేలియన్ భూభాగాన్ని ఉపయోగించడాన్ని అనుమతించవద్దని ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని కోరింది.

 
మరోవైపు, ఢిల్లీలోని ఆస్ట్రేలియన్ హైకమిషన్ కూడా ఈ ఘటనలపై ఆందోళన వ్యక్తం చేసింది. వీటిపై దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొంది. ‘‘భారత్ మాదిరిగా ఆస్ట్రేలియా కూడా గర్వించదగిన, బహుళ సాంస్కృతిక దేశం.. మెల్‌బోర్న్‌లోని రెండు హిందూ దేవాలయాలను ధ్వంసం చేయడంతో మేము దిగ్భ్రాంతికి గురయ్యాం.. ఆస్ట్రేలియా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛకు మా బలమైన మద్దతు ద్వేషపూరిత ప్రసంగం లేదా హింసను ప్రోత్సహించదు’’ ఆస్ట్రేలియా హై కమిషనర్ బారీ ఓ ఫారెల్ ఇటీవల ట్వీట్ చేశారు.