తారకరత్నకు గుండెపోటు – నిల‌క‌డ‌గా ఆరోగ్య ప‌రిస్థితి

టాలీవుడ్ హీరో, నందమూరి బాలకృష్ణ సోదరుడి కుమారుడు తార‌క‌ర‌త్న తీవ్ర అస్వ‌స్థ‌త‌తో ఆసుప‌త్రిలో చేరారు. టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కుప్పంలో `యువగళం’ పాదయాత్ర ప్రారంభిస్తున్న సమయంలో ఆయన అకస్మాత్తుగా కుప్పకూలిపోవడంతో అక్కడనే కుప్పంలోని ఈపీఎస్ మెడిక‌ల్ కాలేజీకి త‌ర‌లించారు.

గుండెకు ర‌క్తం వెళ్లే నాళాల్లో బ్లాక్ ఏర్ప‌డ‌టంతో తార‌క‌ర‌త్న‌కు గుండెపోటు వ‌చ్చిన‌ట్లు టీడీపీ సీనియ‌ర్ నేత  గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి తెలిపాడు. యాంజియోగ్రామ్ ప‌రీక్ష‌లో ఈ స‌మ‌స్య‌ను వైద్యులు గుర్తించిన‌ట్లు ఆయ‌న తెలిపాడు.  ప‌ల్స్ రేటు కూడా త‌క్కువ‌గానే ఉన్న‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం తార‌క‌ర‌త్న‌కు డాక్ట‌ర్స్ చికిత్స‌ను అందిస్తున్న‌ట్లు తెలిసింది. ప్ర‌మాద‌మేమి లేద‌ని వైద్యులు చెప్పిన‌ట్లు స‌మాచారం.

ఊహించిన‌దానికంటే ఎక్కువ‌గా మంది అభిమానులు రావ‌డంతోనే తార‌క‌ర‌త్న అస్వ‌స్థ‌త‌కు లోనైన‌ట్లు తెలిసింది. ఓ వైపు సినిమాలు చేస్తూనే టీడీపీ పార్టీ కార్య‌క్ర‌మాల్లో తరచుగా తార‌క‌ర‌త్న భాగం అవుతోన్నారు.

తారకరత్న స్పృహతప్పి పడిపోయిన విషయం తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్.. తన బాబాయ్ బాలకృష్ణకు ఫోన్ చేశారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఇటు చంద్రబాబు కూడా బాలయ్యకు ఫోన్ చేశారు. దగ్గరుండి చికిత్స ఏర్పాట్లను చేయాలని సూచించారు. తారకరత్నకు యాంజియోగ్రామ్ పూర్తైందని.. మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తరలించనున్నట్టు బాలకృష్ణ చెప్పారు.