ఎమ్మెల్యే వేధిస్తుండని మున్సిపల్ ఛైర్ పర్సన్ రాజీనామా

బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వేదింపులు భరించలేక జగిత్యాల మున్సిపల్ ఛైర్ పర్సన్ బోగ శ్రావణి తన పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్బంగా  మీడియా ముందు కంటతడి పెట్టిన ఆమె మూడేళ్ల పదవీకాలంలో తనను తీవ్ర ఇబ్బందుల పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబానికి ప్రాణహాని ఉందని శ్రావణి ఆరోపించారు.
తన కుటుంబాన్ని సంజయ్ కుమార్ బెదిరించారని ఆమె ఆరోపించారు. మూడేళ్లుగా నరకం అనుభవించానని పేర్కొంటూ ఇప్పడు బయటపడ్డానని తెలిపారు. ఎమ్మెల్యే నుంచి తమకు ఆపద ఉందన్న శ్రావణి తన కుటుంబానికి ఏమైనా జరిగితే అందుకు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కారణమని స్పష్టం చేసారు. తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని ఆమె జిల్లా ఎస్పీని కోరారు.
తాను చేసిన ఆరోపణలు అబద్ధం అయితే.. కాదని ఎమ్మెల్యే తన మనవరాలి మీద ప్రమాణం చేయాలని ఆమె సవాల్ చేశారు. బీసీ మహిళ ఎదగడం చూసి ఓర్వలేక ప్రతి తప్పుకు తనని బాధ్యుల్ని చేశారని శ్రావణి ఆవేదన వ్యక్తం చేశారు. కౌన్సిలర్లను సైతం ఎమ్మెల్యే  సంజయ్ టార్చర్ చేశాడని ఆమె ఆరోపించారు. తనకు చెప్పకుండా  ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టొద్దని ఎమ్మెల్యే హుకుం జారీ చేశాడని, తన పదవితో పోలిస్తే మున్సిపల్ చైర్మన్ పదవి చాలా చిన్నది అంటూ చాలాసార్లు  సంజయ్ అవమానించాడని ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఎమ్మెల్యే ఇబ్బందులు పెడుతున్నా అభివృద్ధే లక్ష్యంగా తాను ముందుకు వెళ్ళానని శ్రావణి చెప్పారు. పేరుకే తాను మున్సిపల్ చైర్మన్ నని పెత్తనమంతా ఎమ్మెల్యేనే చలాయించేవాడని శ్రావణి ఆరోపించారు. పార్టీ కోసం పనిచేస్తున్నా కక్షగట్టి ఇబ్బందులకు గురిచేశారని ఆమె తెలిపారు. ఎమ్మెల్సీ కవితను కలవకూడదని, కేటీఆర్ పేరు ప్రస్తావించకూడదని సంజయ్ కుమార్ హెచ్చరించారని శ్రావణి చెప్పారు.