మంత్రి హామీతో నిరసన విరమించిన రెజ్ల‌ర్లు

భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు వైఖరిపై ఒలింపిక్ పతక విజేతలు బజరంగ్ పూనియా, సాక్షిమాలిక్ తదితరులు నాలుగు రోజులుగా చేబడుతున్న త‌మ నిర‌స‌న‌ను విర‌మిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ హామీ ఇచ్చిన త‌ర్వాత రెజ్ల‌ర్లు ఈ నిర్ణ‌యానికి వ‌చ్చారు.

శుక్ర‌వారం రాత్రి నిర‌స‌న విర‌మిస్తున్న‌ట్లు రెజ్ల‌ర్ భ‌జ‌రంగ్ పూనియాతో పాటు ఇత‌ర రెజ్ల‌ర్లు మీడియా ముందు వెల్ల‌డించారు. రెజ్ల‌ర్లు చేసిన ఆరోప‌ణ‌ల‌పై నాలుగు వారాల్లోగా విచార‌ణ చేప‌ట్టి రిపోర్ట్ ఇస్తామ‌ని కేంద్ర మంత్రి అనురాగ్ తెలిపారు. భార‌త రెజ్లింగ్ స‌మాఖ్య అధ్య‌క్షుడు బ్రిజ్ భూష‌ణ్ కూడా ఆ విచార‌ణ‌కు స‌హ‌క‌రించ‌నున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.

అంత వ‌ర‌కు ఆయ‌న స‌మాఖ్య‌కు దూరంగా ఉంటార‌ని తెలిపారు. బ్రిజ్ భూష‌ణ్ లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డుతున్న‌ట్లు మేటి రెజ్ల‌ర్ వినేశ్ పోగ‌ట్ ఆరోప‌ణ‌లు చేసిన విష‌యం తెలిసిందే. తాజాగా నిర‌స‌న విర‌మించిన వారిలో వినేశ్‌తో పాటు భ‌జ‌రంగ్ పూనియా, సాక్షీ మాలిక్‌, ర‌వి ద‌హియాలు ఉన్నారు.

 ఏడుగురు స‌భ్య‌లతో ఇండియ‌న్ ఒలింపిక్ సంఘం ఓ విచార‌ణ క‌మిటీని ఏర్పాటు చేసింది. బ్రిజ్‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌ను ఆ క‌మిటీ విచారించ‌నున్న‌ది. మేటి బాక్స‌ర్ మేరీ కోమ్ నేతృత్వంలో ఆ విచార‌ణ కొన‌సాగ‌నున్న‌ది. ఆ ప్యానెల్‌లో డోలా బెన‌ర్జీ, అల‌క‌నంద అశోక్‌, యోగేశ్వ‌ర్ ద‌త్‌, స‌హ‌దేవ్ యాద‌వ్‌లు స‌భ్యులుగా ఉంటారు.