జమ్మూలో జంట పేలుళ్లు, ఆరుగురికి గాయాలు

జమ్మూ  రైల్వే స్టేషన్ సమీపంలో శనివారం ఉదయం జంట కారు బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల్లో ఆరుగురు వ్యక్తులు గాయపడ్డారు. రిపబ్లిక్ డే మరో నాలుగు రోజుల్లో ఉండటం, రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ జమ్మూలో కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో పోలీసు యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. 

భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. అగంతకులు కారులో ఐఈడీలు ఉంచి పేల్చివేసినట్టు అధికారులు చెబుతున్నారు. ఉదయం 10.47 నిమిషాలకు ఒక కారు బాంబు పేలుడు చోటుచేసుకోగా, మరో 10 నుంచి 15 నిమిషాల వ్యవధిలోనే మరో బాంబు పేలినట్టు తెలుస్తోంది.

నార్వాల్‌లోని ట్రాన్స్‌పోర్ట్ నగర్ బస్‌యార్డ్ సమీపంలో ఒక దాని వెంట మరొకటి బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నట్టు పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. గాయపడిన ఆరుగురు పౌరులను సమీప ఆసుపత్రికి తరలించామని చెప్పారు. 

జంట కారు పేలుళ్ల ఘటనను జమ్మూ ఏడీజీ ముఖేష్ సింగ్ ధ్రువీకరించారు. సమాచారం తెలియగానే పోలీసులు, బాంబ్ డిస్కోజల్ స్క్వాడ్, ఫోరెన్సిక్ నిపుణులు అక్కడకు చేరుకున్నారని, ఇవి ఏ తరహా పేలుళ్లనేవి నిర్ధారించేందుకు విచారణ జరుపుతున్నామని ముఖేష్ సింగ్ చెప్పారు. 

ఘటనా స్థలిని తమ అధీనంలోకి తీసుకుని విస్కృతంగా గాలింపు చర్యలు జరుపుతున్నామని, వాహనాలను తనిఖీలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర పోలీసులు, సీఆర్‌పీఎఫ్ బలగాలు భారీ బందోబస్తు మధ్య రాహుల్ యాత్ర కొనసాగుతున్నప్పటికీ జంట పేలుళ్లు చోటుచేసుకోవడంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది.

గాయపడిన వారిని సుహైల్ ఇక్బాల్(35), సుశీల్ కుమార్(26), విశ్వ ప్రతాప్(25), వినోద్ కుమార్(52), అరుణ్ కుమార్, అమిత్ కుమార్(40), రాజేశ్ కుమార్(35)గా గుర్తించారు. ఐఈడి పేలుళ్లు ఉధంపూర్ పేలుళ్ల మాదిరిగానే ఉన్నాయని ఆ వర్గాలు తెలిపాయి.  పేలుళ్ల నిర్వహణ తీరు చూశాక అది లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ పనేమోననిపిస్తోంది. వెంటనే పేలుళ్లకు గల కారణాలు గుర్తించాలని, కారకులపై చర్యలు చేపట్టాలని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆదేశించారు.

“ఇలాంటి హీన చర్యలు వారి పిరికితనాన్ని చాటుతున్నాయి. వెంటనే చర్యలు తీసుకోండి. కారకులను న్యాయస్థానం ముందు తీసుకురాడానికి అన్ని చర్యలు చేపట్టండి” అని లెఫ్టినెంట్ జనరల్ భద్రతాధికారులతో పేర్కొన్నారు. ఈ పేలుళ్ల ఘటనలో గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ. 50,000 నష్టపరిహారంను కూడా లెఫ్టినెంట్ జనరల్ ప్రకటించారు.