గాలి అక్రమ ఆస్తులపై సిబిఐ దర్యాప్తు

కర్ణాటకలో గనుల దిగ్గజం, రాజకీయ నేత గాలి జనార్దన రెడ్డికి భారీ షాక్ తగిలింది. మాజీ మంత్రి అయిన గాలికి చెందిన అక్రమ ఆస్తులను సిబిఐ జప్తు చేసుకునేందుకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. గాలి, ఆయన భార్య, ఆయన పేరిట ఉన్న కంపెనీలకు చెందిన ఆస్తుల జప్తుకు ఈ చర్యతో వీలేర్పడుతుంది.

రెడ్డికి చెందిన ఆస్తుల అటాచ్ విషయంలో అనుమతికి జాప్యం ఎందుకు జరుగుతోందనేది తమకు రెండు రోజులలో తెలియచేయాలని ఈ నెల 10వ తేదీనే హైకోర్టు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి గడువు ఇచ్చింది. ఈ క్రమంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఆస్తుల జప్తునకు తమకు అభ్యంతరం లేదని తెలియచేసుకుంది.

సిబిఐకి చెందిన ఎస్‌పి స్థాయి అధికారి ఈ ఆస్తుల స్వాధీనం చేసుకోవచ్చునని తెలిపింది. గాలి జనార్ధన రెడ్డిపై పలు అక్రమ వ్యవహారాలకు సంబంధించి సిబిఐ కోర్టులలో కేసులు ఉన్నాయి. రెడ్డి , ఆయన భార్య, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లోని ఆయనకు చెందిన కంపెనీల పేరిట ఉన్న లెక్కల్లోకి రాని ఆస్తులు అక్రమ ఆస్తులుగా నిర్థారణ అయినందున , వీటి స్వాధీనానికి సిబిఐ చర్యలు చేపట్టింది.

2013 నుంచి గాలిపై అక్రమ మైనింగ్ కేసు ప్రత్యేక న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉంది. బిజెపితో తెగతెంపులు చేసుకొని, డిసెంబర్ 25వ తేదీన గాలి కళ్యాణ రాజ్య ప్రగతి రక్ష పేరిట రాజకీయ పార్టీని ప్రారంభించారు. స్వయంగా ఎన్నికలతో పోటీ చేయడంతో పాటు, తన పార్టీ అభ్యర్థులు పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు.