పాకిస్థాన్ లో శ్రీలంక తరహా ఆకలి కేకలు

పాకిస్థాన్ లో శ్రీలంక తరహా ఆకలి కేకలు

పాకిస్థాన్ లో శ్రీలంక తరహా సంక్షోభకర పరిస్థితి నెలకొంది. దాయాది దేశంలో ఆకలి కేకలతో అక్కడి ప్రజలు అలమటిస్తున్నారు. తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఏర్పడటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత ఏడాది భారీ వరదలు సంభవించి, దాని నుంచి కోలుకోకముందే మరో సంక్షోభంలో చిక్కుకుని విలవిల్లాడుతున్నారు.

పాక్ ఆర్థిక వ్యవస్థ మరో రూ.3.3 లక్షల కోట్ల మేర నష్టపోయింది. ఇలాంటి విపత్కర పరిస్థితులు తలెత్తడంతో దేశం దివాళా తీసే స్థాయికి వెళ్లిపోయింది.  ప్రస్తుతం పాక్ లో విద్యుత్, ఆహారం, ఇంధనం, డబ్బుకు కొరత ఏర్పడింది. విద్యుత్లేక ఆ దేశం చీకట్లలో మగ్గుతోంది.

విద్యుత్ ను ఆదా చేసేందుకు షాపులు, షాపింగ్ మాళ్లను రాత్రి 8.30కే మూసేయాలని, రెస్టారెంట్లను రాత్రి 10 గంటల లోపు కట్టేయాలని ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆదేశాలిచ్చారు. విద్యుత్ ను ఎక్కువ గుంజే ఫ్యాన్ల తయారీని నిలిపి వేశారు. ప్రభుత్వ ఆఫీసుల్లో విద్యుత్ వాడకాన్ని 30 శాతానికి తగ్గించాలని ఆదేశాలు జారీ చేశారు. 

దాయాది దేశంలో ఇప్పుడు విదేశీ మారక నిల్వలు (డాలర్) గణనీయంగా పడిపోయాయి. నిరుడు జనవరిలో 16.6 బిలియన్ డాలర్లున్న ఆ దేశ విదేశీ మారక నిల్వలు ఇప్పుడు 5.6 బిలియన్ డాలర్లకు పడిపోయాయంటేనే పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది. పెట్రోల్, డీజిల్పై పాకిస్థాన్  ఎక్కువగా విదేశాలపైనే ఆధారపడడం, వాటి ధరలు విపరీతంగా పెరగడం, పాకిస్థాన్ రూపీ విలువ పతనమవ్వడం వంటి కారణాలు డాలర్ నిల్వలు తరిగి పోవడానికి కారణమైంది. ఫలితంగా ఆ దేశంలో ద్రవ్యోల్బణం పెరిగిపోయింది.

పాకిస్థాన్  బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (పీబీఎస్) ప్రకారం నిరుడు 24.5 శాతంగా నమోదైంది. గోధుమలు, కూరగాయలు ఇతర తిండి వస్తువుల ధరలు ఆకాశాన్నంటేశాయి. తిండి గింజలకు కొరత ఏర్పడింది. గోధుమ పిండి కోసం వీధుల్లో జనం ఎగబడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో తొక్కిసలాటలు జరుగుతున్నాయంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సోమవారం ఆ గొడవల్లో నలుగురు చనిపోయారు. ఇప్పటికీ దుకాణాల ముందు నిత్యావసరాల కోసం జనం క్యూలు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.

వర్షాలు, వరదలవల్ల పంటలు బాగా దెబ్బతినడంతో నిత్యావసరాలు ధరలు నింగిని తాకుతున్నాయి. ప్రకృతి వైపరీత్యానికి తోడు అక్కడి ప్రభుత్వం ముందుచూపు లేమి కూడా ప్రజలను కష్టాలపాలు చేస్తున్నది. సంక్షోభం కారణంగా ఒక లీటర్‌ పాల ధర రూ.150కి చేరింది. 2021 జనవరిలో కిలో రూ.36గా ఉన్న ఉల్లిగడ్డ ధర 2022 జనవరిలో రూ.220కి చేరింది. వీటితోపాటు ఇతర నిత్యావసరాల ధరలు కూడా భారీగా పెరిగాయి. . కిలో గోధుమ పిండి రూ.150కి చేరింది. బియ్యం ధర కూడా మునుపటి ధరకు రెండింతలయ్యింది.

 వీటికి తోడు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు కూడా 48 శాతం రెట్టింపయ్యాయి. ముందుముందు ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అక్కడి ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆర్థిక సంక్షోభం ముంగిట ఆ దేశం ఇటు రాయబార కార్యాలయాలను మూసేస్తున్నది. ఈ పరిస్థితుల నుంచి జనాన్ని బయట పడేసేందుకు ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఆయన సోమవారం జెనీవాలో జరిగిన ఓ సదస్సులో విదేశాల సాయం కోసం అర్థించారు. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) నుంచి రావాల్సిన ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ (ఈఎఫ్ఎఫ్) నిధుల కోసం పాక్ అధికారులు ఐఎంఎఫ్ అధికారులతో సమావేశమయ్యారు. వాస్తవానికి 6 బిలియన్ డాలర్ల ఈఎఫ్ఎఫ్ కోసం 2019లోనే ఒప్పందం కుదరగా, దానిని ఆ తర్వాత 7 బిలియన్ డాలర్లకు పెంచారు.

అయితే, నిరుడు నవంబర్లో పాక్కు 1.18 బిలియన్ డాలర్ల ఈఎఫ్ఎఫ్ను ఐఎంఎఫ్  ఇవ్వలేదు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు పన్నులు, విద్యుత్ చార్జీలు, ఎక్స్చేంజ్ రేట్పై కృత్రిమ నియంత్రణ వంటి చర్యలకు పాక్ అంగీకరించకపోవడంతో ఐఎంఎఫ్ ఆ నిధులను ఆపేసింది.  వరదలవల్ల జరిగిన నష్టాన్ని పూడ్చటానికి పాకిస్థాన్‌ భారీగా అప్పులు తీసుకొస్తున్నది. దాంతో 2011లో ఆ దేశ జీడీపీలో 52.8 శాతంగా, 2016లో 60.8 శాతంగా ఉన్న అప్పులు ప్రస్తుతం 77.8 శాతానికి పెరుగుతాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు డాలర్‌తో పాకిస్థాన్‌ రూపీ మారకం విలువ కూడా రూ.177కు పతనమైంది.

ఈ పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు పాకిస్తాన్ మరిన్ని అప్పులు చేసేందుకు సిద్ధమవుతున్నది. చైనా నుంచి 2.1 బిలియన్ డాలర్లు అప్పుగా తీసుకునేందుకు నిర్ణయించింది. అంతేగాకుండా పాక్  స్టేట్బ్యాంక్లో సౌదీ ఫండ్ ఫర్ డెవలప్మెంట్ నిధులను 3 బిలియన్ డాలర్ల నుంచి 5 బిలియన్ డాలర్లకు పెంచేందుకు స్టడీ చేయాలని నిర్ణయించింది. ఈ రెండు ఫలిస్తే పాక్కు అంతో ఇంతో ఊరట ఉంటుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. రాబోయే మరికొన్ని నెలలు పాకిస్థాన్లో గడ్డు పరిస్థితులు తప్పవని అంచనా వేస్తు్న్నారు.