శ్రీలంకపై శతకంతో పలు రికార్డుల సృష్టించిన కోహ్లీ

శ్రీలంకపై శతకంతో పలు రికార్డుల సృష్టించిన కోహ్లీ
2022ను సెంచరీతో ముగించిన విరాట్ కోహ్లీ 2023ను సెంచరీతో ప్రారంభించాడు. గువహటి వేదికగా శ్రీలంకతో జరుగుతోన్న తొలి వన్డేలో సెంచరీ నమోదు చేసిన కోహ్లి ఈ క్రమంలో అనేక రికార్డులను బ్రేక్ చేశాడు. శ్రీలంకపై విరాట్‌కు వన్డేల్లో ఇది 9వ శతకం కావడం విశేషం. ఆ జట్టుపై అత్యధిక సెంచరీలు నమోదు చేసిన ఆటగాడిగా సచిన్ టెండుల్కర్ (8)ను కోహ్లి వెనక్కి నెట్టాడు
 
ఓ జట్టుపై వన్డేల్లో అత్యధిక శతకాలు నమోదు చేసిన బ్యాటర్‌గా కోహ్లి తన రికార్డును తనే సమం చేసుకున్నాడు. విరాట్ వెస్టిండీస్‌పైనా 9 సెంచరీలు చేయగా, సచిన్ ఆస్ట్రేలియాపై 9 శతకాలు నమోదు చేశాడు.

ఓ దేశంలో అత్యధిక వన్డే సెంచరీలు చేసిన ఆటగాడిగా సచిన్ రికార్డును విరాట్ కోహ్లి సమం చేశాడు. భారత గడ్డ మీద 160 వన్డే ఇన్నింగ్స్ ఆడిన సచిన్ 20 సెంచరీలు చేయగా, కోహ్లి 99 ఇన్నింగ్స్‌ల్లోనే 20వ శతకాన్ని అందుకున్నాడు. తర్వాతి స్థానంలో హషీమ్ ఆమ్లా (దక్షిణాఫ్రికా గడ్డ మీద 69 ఇన్నింగ్స్‌ల్లో 14 సెంచరీలు), రిక్కీ పాంటింగ్ (ఆస్ట్రేలియాలో 151 ఇన్నింగ్స్‌ల్లో 14 శతకాలు) ఉన్నారు.

విరాట్ కోహ్లికి వన్డేల్లో ఇది 45వ సెంచరీ కావడం గమనార్హం. కేవలం సచిన్ టెండుల్కర్ (49 సెంచరీలు) మాత్రమే కోహ్లి కంటే ముందున్నాడు. వన్డేల్లో 45 సెంచరీలు చేయడానికి సచిన్‌కు 424 ఇన్నింగ్స్ అవసరం కాగా, విరాట్ కోహ్లి 257 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించడం విశేషం.

విరాట్ కోహ్లికి ఇది బ్యా్క్ టు బ్యాక్ సెంచరీ కాగా, గువహటిలో మూడో శతకం కావడం విశేషం. చివరిసారిగా భారత్ గువహటిలో వెస్టిండీస్‌పై వన్డే మ్యాచ్ ఆడింది. ఆ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 117 బంతుల్లో 152 పరుగులతో నాటౌట్‌గా నిలవగా, 107 బంతుల్లో 140 రన్స్ చేసిన విరాట్ కోహ్లి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.

 
వన్డే క్రికెట్లో వేగంగా 12,500 రన్స్ పూర్తి చేసుకున్న క్రికెటర్‌గా విరాట్ కోహ్లి రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇప్పటి వరకూ 257 వన్డే ఇన్నింగ్స్ ఆడిన కోహ్, 57.72 యావరేజ్‌తో 12,584 రన్స్ చేశాడు. ఇందులో 45 సెంచరీలు ఉండగా, 64 అర్ధ శతకాలున్నాయి. 1021 రోజుల తర్వాత 2020 సెప్టెంబర్ 8న అంతర్జాతీయ క్రికెట్లో తొలి సెంచరీ చేసిన విరాట్ కోహ్,  1144 రోజుల తర్వాత ఇప్పుడు భారత గడ్డపై తొలి శతకం నమోదు చేయడం విశేషం.
తొలి వన్డేలో భారత్ ఘన విజయం
కాగా, శ్రీలంక-ఇండియా మధ్య జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. లంకపై 67 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 373 పరుగులు చేసింది. 374 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 306 పరుగులు చేసింది.
 
ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీతో విజృంభించాడు. కోహ్లీ 87 బంతుల్లో 113 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ 67 బంతుల్లో 83 పరుగులు, శుభమన్ గిల్ 60 బంతుల్లో 70 పరుగులు, రాహుల్ 29 బంతుల్లో 39 పరుగులు, శ్రేయస్ అయ్యర్ 24 బంతుల్లో 28 పరుగులు చేసి పర్వాలేదనిపించారు. లంక శనకా కెప్టెన్ సెంచరీ చేశాడు. శనకా 88 బంతుల్లో 108 పరుగులు చేశాడు.
 
లంక బ్యాట్స్‌మెన్లలో నిశాంక (72), దిసిల్వా (47), అసలంకా(23),  వానిందు హసరంగా (16), చమిక కరుణారత్నే(14) పరుగులు చేసి ఔటయ్యారు. భారత జట్టు బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ మూడు వికెట్లు పడగొట్టగా సిరాజ్ రెండు వికెట్లు, షమీ, హార్ధిక్ పాండ్యా, యుజేంద్ర చాహల్ తలో ఒక వికెట్ తీశారు. లంక బౌలర్లలో రజిత్ మూడు వికెట్లు పడగొట్టగా మదుశంకా, కరుణరత్నే, శనకా, ది సిల్వా తలో ఒక వికెట్ తీశారు.