జపాన్ వార్‌గేమ్స్‌లో తొలిసారి భారత మహిళా ఫైటర్ పైలట్!

తొలిసారి భారత వాయుసేనకు చెందిన మహిళా పైలట్ దేశం వెలుపల జరుగనున్న యుద్ధక్రీడలు (వార్‌గేమ్స్)లో పాల్గొనబోతున్నారు. భారత్‌కు చెందిన ముగ్గురు మహిళా ఫైటర్ పైలట్స్‌లో ఒకరైన స్కాడ్రన్ లీడర్ అవనీ చతుర్వేది త్వరలో యుద్ధ క్రీడల్లో పాల్గొనేందుకు జపాన్ వెళ్లబోతున్నారు.

స్కాడ్రన్ లీడర్ చతుర్వేది సు30ఎంకెఐ పైలట్. జపాన్ లోని  హయకురి ఎయిర్ బేస్‌లో జనవరి 16 నుంచి 26 వరకు ‘వీర్ గార్డియన్ 2023’ ఎక్సర్‌సైజ్‌ను నిర్వహిస్తారు. హయకురి ఎయిర్ బేస్ పరిసరాలలోని ఒమిటమా, సయామాలోని ఇరుమా ఎయిర్ బేస్‌లో కూడా ఈ వార్‌గేమ్స్ జరుగనున్నాయి.

ఈ సందర్భంగా స్కాడ్రన్ లీడర్ భావన కాంత్ మాట్లాడుతూ ‘ఎగిరే విమానాలకు వాటిని నడుపుతున్నది పురుషుడా లేక మహిళా అనేది తెలియదు’ అని పేర్కొన్నారు. వైమానిక దళంలో ఉన్నందుకు తాను గర్విస్తున్నానని తెలిపారు.  ప్రముఖ పైటర్ పైలట్ గ్రూప్ కెప్టెన్ అర్పిత్ కళా మాట్లాడుతూ ‘ఎస్‌యు-30ఎంకెఐ’ ప్రత్యేకమైనదని చెప్పారు. ఆ విమానానికి ప్రపంచంలోనే ఉత్తమమైన టెక్నాలజీలు, ఆయుధాలు ఉంటాయని తెలిపారు.

దీర్ఘశ్రేణి లక్షాన్ని బేధించగల సామర్థం ఉన్న ఎస్‌యు30 ఉన్న ఒకే దేశం భారత్. తాజా ఆయుధాలతో సుఖోయ్ ఫ్లీట్‌ను భారత్ ఇంకా ఆధునీకరిస్తోంది. గత రెండేళ్లలో స్పైస్-2000 సీరీస్ ప్రిసిషన్‌గైడెడ్ ఆయుధాలను దీనికి జతచేశారు.