జనవరి 31 నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ఈ నెల 31 నుంచి ప్రారంభించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ సారి కూడా సమావేశాలు రెండు విడుతల్లో జరుగుతాయని పేర్కొన్నాయి. సమావేశాలు జనవరి 31న ప్రారంభమై, ఏప్రిల్‌6న ముగియనున్నాయి. దీనిపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

ఇప్పటికే పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల పూర్తి అజెండా పార్లమెంటరీ వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీకి చేరినట్లు తెలుస్తున్నది. సమాచారం ప్రకారం.. ఫిబ్రవరి ఒకటిన కేంద్ర బడ్జెట్‌ 2023-24ను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌కు సమర్పించనున్నారు. అంతకు ముందు రోజు అంటే 31న ఆర్థిక సర్వేను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో తొలిరోజు ఉభయసభలు ప్రారంభమవుతాయని అధికార వర్గాలు తెలిపాయి. తొలి విడతలో సమావేశాలు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 10 వరకు, రెండో విడతలో మార్చి 6న ప్రారంభమై ఏప్రిల్‌ 6తో ముగియనున్నట్లు తెలుస్తున్నది.
 
బడ్జెట్‌ సమావేశాల తొలి విడతలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ చేసే తీర్మానంపై చర్చించనున్నారు. ఆ తర్వాత కేంద్ర బడ్జెట్‌పై జరిగే చర్చలకు ఆర్థిక మంత్రి సమాధానం సమాధానం ఇవ్వనున్నారు. రెండో విడుత సమావేశాల్లో వివిధ మంత్రిత్వ శాఖలకు నిధుల కేటాయింపులపై చర్చించడం, బడ్జెట్‌కు ఆమోదం తదితర అంశాలపై చర్చించనున్నారు.