దేశవ్యాప్తంగా కరోనాపై మంగళవారం మాక్ డ్రిల్

దేశవ్యాప్తంగా కరోనాపై మంగళవారం మాక్ డ్రిల్
తగ్గినట్టే తగ్గి చైనా సహా పలు దేశాల్లో ఒక్కసారిగా పెరిగిన కరోనా కొత్త కేసులతో ఇప్పటికే ముందుజాగ్రత్త చర్యలు చేపట్టిన తాజాగా వైద్యారోగ్య వ్యవస్థ సంసిద్ధతను పరీక్షించి, సమీక్షించేందుకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో, ఆస్పత్రుల్లో మంగళవారం మాక్ డ్రిల్ నిర్వహించాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా సూచించారు. 
 
ఈ మాక్ డ్రిల్‌లో వైద్యులు, వైద్య సిబ్బంది, అధికారులతో పాటు ఆయా రాష్ట్రాల మంత్రులు కూడా పాల్గొంటారని ఆయన వెల్లడించారు. 2021లో కరోనా రెండో వేవ్ సమయంలో ఒక్కసారిగా మెడికల్ ఆక్సిజన్ డిమాండ్ పెరగడంతో పాటు వైద్యారోగ్య వ్యవస్థ సామర్థ్యాన్ని మించి కేసులు నమోదైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. 
 
చైనా తరహాలో దేశంలో కేసుల ఉధృతి ఒక్కసారిగా పెరిగితే ఎలా వ్యవహరించాలి అనే విషయంపై దృష్టి పెట్టింది. అన్ని రాష్ట్రాల్లో మాక్ డ్రిల్ నిర్వహించడం ద్వారా వ్యవస్థలో లోటుపాట్లను గుర్తించి సరిదిద్దుకోడానికి ఆస్కారం ఉంటుందని కేంద్రం భావిస్తోంది. ఈ మాక్ డ్రిల్‌లో భాగంగా ఆస్పత్రుల్లో పడకలు, మెడికల్ ఆక్సిజన్ లభ్యత, అందుబాటులో ఉన్న వైద్య సిబ్బంది సంఖ్య తదితర నిర్వహణపరమైన అంశాలను పరిశీలించనున్నారు.
 
 ఇందులో నర్సులు, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు సైతం భాగస్వాములు కానున్నారని కేంద్రం తెలిపింది. ముఖ్యంగా వ్యాధి తీవ్రత అధికంగా ఉండే కేసులకు వైద్యం అందించే వ్యవస్థలో భాగమైన ఐసీయూ పడకలు, వెంటిలేటర్ల లభ్యత వంటి అంశాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు కేంద్ర  ప్రభుత్వం వివరించింది. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే ఎదుర్కొనేందుకు వీలుగా అన్ని రాష్ట్రాలు సమాయత్తం కావాలన్నదే తమ ఉద్దేశమని కేంద్రం చెబుతోంది.
 
మరోవంక, కరోనా కొత్త వేరియంట్ వైరస్ ముప్పును దృష్టిలో పెట్టుకుని కొన్ని రాష్ట్రాలు కొత్త సంవత్సరం వేడుకలపై ఆంక్షలు విధించాయి. అర్థరాత్రి ఒంటి గంట వరకే కొత్త సంవత్సరం వేడుకలకు అనుమతి అంటూ కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. 
 
వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు, గర్భిణులు, చిన్నారులు రద్దీ ప్రదేశాలకు దూరంగా ఉండాలని సూచించింది. పబ్‌లు, రెస్టారెంట్లు, సినిమా థియేటర్లు, విద్యాసంస్థల్లో తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ఆదేశించింది. మాస్క్ ధరించనివారికి జరిమానా విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోనప్పటికీ, కరోనా ఆంక్షలను మాత్రం అమల్లోకి తీసుకొచ్చింది. 
మరోవంక, దేశంలో విదేశీ కరోనా భయాలు ఎక్కువ అయ్యాయి. విదేశాలకు వెళ్లి తిరిగి దేశానికి వస్తున్న వారిలో ఎక్కువ మందికి కరోనా ఉన్నట్లు నిర్థారణ కావడంతో దేశంలోని పలు ప్రాంతాల్లో ఒక్కసారి కలవరం చెలరేగింది. విదేశాల నుంచి విమానాలలో వచ్చిన వారిలో సోమవారం ఒక్కరోజే మొత్తం మీద 16 మందికి కరోనా వైరస్ ఉన్నట్లు వివిధ స్థాయిల్లో నిర్థారణ కావడం. వీరిని ఐసోలేషన్‌లకు, తగు పరీక్షలకు పంపించడం, రక్తనమూనాలను ల్యాబ్‌లకు పంపించడం జరుగుతోంది.