పాక్‌ సరిహద్దులో అత్యాధునిక అమెరికన్‌ డ్రోన్‌ స్వాధీనం

పాక్‌ సరిహద్దులో అత్యాధునిక అమెరికన్‌ డ్రోన్‌ స్వాధీనం
పంజాబ్‌ లోని అమృత్‌సర్‌ వద్ద పాకిస్థాన్ సరిహద్దులో అంతర్రాష్ట్ర హెరాయిన్‌ స్మల్లింగ్‌ రాకెట్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి అమెరికన్‌లో తయారైన అత్యాధునిక డ్రోన్‌తో సహా పది కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు.  డ్రోన్‌లో ఇన్‌ఫ్రారెడ్ ఆధారిత నైట్ విజన్ కెమెరా కూడా ఉందని, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్న పెద్ద ముఠా ఇదేనని పంజాబ్‌ డీజీపీ గౌరవ్‌ యాదవ్‌ తెలిపారు. అమృత్‌సర్ దేహత్ పోలీసులు గత నెలలో ఐదు డ్రోన్‌లను స్వాధీనం చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు.
ఆదివారం అరెస్టు చేసిన స్మగ్లర్లను ఘరిండా పోలీస్ స్టేషన్ పరిధిలోని దల్బీర్ సింగ్, జగదీశ్‌ సింగ్‌గా పోలీసులు గుర్తించారు. ముఠా సభ్యులు గత మూడేళ్లుగా పొరుగు రాష్ట్రాలకు నిరంతరం డ్రగ్స్‌ను రవాణా చేస్తున్నారని, అరెస్టు చేసిన నిందితులిద్దరిపై ఎలాంటి క్రిమినల్ కేసు నమోదు కాలేదని డీజీపీ తెలిపారు.
ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా ఎఎస్పీ స్వపన్‌ శర్మ బృందం ముఠాను పట్టుకుందని తెలిపారు. నిందితులు హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌తో పాటు పలు రాష్ట్రాలకు హెరాయిన్‌ పంపుతున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని చెప్పారు.
నిందితుల నుంచి రూ.20లక్షల విలువైన అమెరికా తయారీ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నామని, ఇందులో అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు. దీర్ఘకాలిక బ్యాటరీ, ఇన్‌ఫ్రారెడ్ ఆధారిత నైట్ విజన్ కెమెరా ఉందన్నారు. స్మగ్లర్లు కొత్త మార్గాల్లో హెరాయిన్‌ స్మగ్లింగ్‌ చేస్తూ తప్పించుకుంటున్నారని పేర్కొన్నారు.
వీరి నెట్‌ వర్క్‌ పొరుగు రాష్ట్రాలకు విస్తరించినట్ల గుర్తించారు. ఢిల్లీ, హర్యానా తదితర రాష్ట్రాల్లోని 12 ప్రాంతాల్లో వివిధ పోలీసు బృందాలు దాడులు నిర్వహిస్తున్నాయి. అరెస్టుల తర్వాత మరింత డ్రగ్స్‌ స్వాధీనమయ్యే అవకాశం ఉంది. నిందితులను కోర్టులో హాజరు పరుస్తామని ఎస్‌ఎస్పీ స్వపన్‌ శర్మ తెలిపారు.