కొత్త కరోనా కేసులను ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయవద్దు 

కరోనా కొత్త వేరియంట్ ను అడ్డుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తూ కొత్త కేసులను ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయొద్దని  కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ హెచ్చరించారు. రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
సీనియర్ సిటిజన్స్ కు బూస్టర్ డోసులు వేయించేలా చర్యలు తీసుకోవాలని మాండవియా సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరి చేయాలని, రెగ్యులర్ హ్యాండ్ వాష్పై ప్రజలకు మళ్లీ అవగాహన కల్పించాలని సూచించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు రాష్ట్రాలు సిద్ధంగా ఉండాలని, ఆస్పత్రుల్లో అన్ని వసతులను ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు.
కరోనా ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోలేదని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కేంద్రం ఇప్పటికే సూచించింది. కరోనా సర్వైలెన్స్ వ్యవస్థను పటిష్టపర్చే దిశగా నిర్ణయాలు తీసుకుంది. ప్రతి ఒక్కరూ మాస్కులను ధరించాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే గైడ్ లైన్స్ జారీ చేసింది. 
 
రద్దీగా ఉన్న ప్రదేశాలతో పాటు ఇండోర్, ఔట్ డోర్స్ లల్లో మాస్కులను ధరించాలని సూచించింది. షాపింగ్ మాల్స్, ఏసీ గదులు, హోటల్స్, మల్టీప్లెక్సుల్లో మాస్కులను ధరించడాన్ని తప్పనిసరి చేసింది. టెస్టుల సంఖ్యను పెంచాలన్నారు. టెస్ట్-ట్రాక్- ట్రీట్‌తో పాటు వ్యాక్సినేషన్‌పై దృష్టి సారించాలని సూచించారు. 
 
కేంద్రం నుంచి అన్ని విధాలా సాయమందిస్తామని మాండవీయ రాష్ట్రాల ఆరోగ్య  హామీ మంత్రులకు హామీ ఇచ్చారు. కరోనాపై సన్నద్ధత కోసం దేశంలోని అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో మాక్ డ్రిల్ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 27న మాక్ డ్రిల్ నిర్వహిస్తారు.
ఆంగ్ల సంవత్సరాది వేడుకల నేపథ్యంలో ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించేలా చూడాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. కొత్త వేరియంట్‌ను ఎదుర్కొనేందుకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసే అవకాశం ఉంది.