కీవ్‌పై భీకర దాడికి 2 లక్షల మంది రష్యా సైనికుల సిద్ధం!

2023 తొలి నెలల్లో రష్యా భీకర దాడులకు పాల్పడే అవకాశం ఉందని పేర్కొంటూ  దీని కోసం కొత్తగా 2 లక్షల మంది సైనికులను సిద్ధం చేసుకుంటోందని ఉక్రెయిన్ కమాండ్ ఇన్ చీఫ్ జనరల్ వలేరీ జాలుజ్నీ కీలక వ్యాఖ్య చెప్పారు. ఒక బ్రిటిష్ వీక్లీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో  వచ్చే ఫిబ్రవరి లేదా మార్చి నెలల్లో రష్యా దాడులు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు.

జనవరి చివర్లో దాడులు మొదలైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెబుతూ ఇప్పుడు రష్యా దాడులను తగ్గించడం కూడా యుద్ధ వ్యూహంలో భాగమేనని ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యవధిలో తన సైనిక బలగాలను పెంచుకోవడం ద్వారా మళ్లీ యుద్ధానికి పూర్తి స్థాయిలో సిద్ధమవుతుందని తెలిపారు. యుద్ధానికి సంబంధించి ఇది చాలా వ్యూహాత్మక నిర్ణయమని చెప్పారు.

తమ రాజధాని కీవ్ ను రష్యా దాడి చేస్తుందనే విషయంలో తనకు ఎలాంటి అనుమానం లేదని స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం తమ ముందున్న ప్రధాన లక్ష్యం ఫ్రంట్‌లైన్‌ ను కాపాడుకోవడమే అని వలేరీ జాలుజ్నీ తెలిపారు. రాబోయే రోజులను దృష్టిలో పెట్టుకుని అందుకు పూర్తి సన్నద్ధమవుతున్నట్లు చెప్పారు.

రష్యా మరోసారి విరుచుకుపడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎన్ని ట్యాంకులు, ఆయుధాలు, సైనికులు కావాలనే విషయంలో తాము కూడా పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. ‘మా భూభాగాన్ని కొంత కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేము. యుద్ధంలో మా శత్రువును జయిస్తామనే నమ్మకం మాకు ఉంది. అయితే మాకు యుద్ధ వనరులు చాలా అవసరం. 300 యుద్ధ ట్యాంకులు, 600 నుంచి 700 వరకు ఇన్ఫాంట్రీ ఫైటింగ్ వెహికిల్స్, 500 హోవిట్జర్‌ లు అవసరం’ అని వివరించారు.

ఇదంతా చూస్తుంటే ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధం ఇప్పట్లో ఆగేలా లేదు. యుద్ధం ఇప్పట్లో ముగిసే అవకాశం లేదని రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా ఇటీవల పేర్కొనడం గమనార్హం. మరోవైపు తమ దేశం శ్మశానంగా మారిపోతున్నా ఉక్రెయిన్ కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. చివరి వరకు పోరాడతామని స్పష్టం చేసింది.