
కేరళలో బర్డ్ ప్లూ పంజా విసిరడంతో కోళ్లు, బాతులు, ఇతర పెంపుడు పక్షులను చంపాలని కేరళ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. బర్డ్ ఫ్లూ సోకిన పక్షులను తినడం వల్ల జబ్బు మనుషులకు కూడా సోకే ప్రమాదం ఉంది. ముఖ్యంగా వలస పక్షులు, సముద్ర పక్షుల ద్వారా బర్డ్ ఫ్లూ వ్యాపిస్తుంది.
కొట్టాయం జిల్లాలోని అర్పూకర, తలయాజమ్ గ్రామాల్లో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందింది. దీంతో ప్రభావిత ప్రాంతాలకు ఒక కిలోమీటరు పరిధిలో ఉన్న 8వేల బాతులు, కోళ్లు ,ఇతర పెంపుడు పక్షులను చంపాలని అధికారులు ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ పీకే జయశ్రీ అధ్యక్షతన అత్యవసర సమావేశం నిర్వహించి గ్రామాల్లో క్రిమిసంహారక చర్యలు చేపట్టాలని స్థానిక సంస్థలు, జంతుసంక్షేమ శాఖలను ఆదేశించారు. ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను వేగవంతం చేయాలని, క్రిమిసంహారక మందులను చల్లాలని స్థానిక సంస్థలను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
బర్డ్ ఫ్లూ కేంద్రంగా ఉన్న 10 కిలోమీటర్ల పరిధిలో మూడు రోజుల పాటు కోడి, బాతు, పిట్ట, కోడి గుడ్లు, మాంసం అమ్మకాలు, దిగుమతిపై నిషేధం విధిస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. పోలీసులు, రెవెన్యూ, జంతు సంరక్షణ శాఖ, అటవీ శాఖ అధికారులు సమన్వయంతో రక్షణ చర్యల్లో పాల్గొనాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రభావిత ప్రాంతాల నుంచి కోళ్లు, బాతులు, మాంసం అమ్మకాలు, ఎగుమతులు, దిగుమతులపై నిషేధం విధించారు.
అర్పూకరలోని డక్ ఫామ్లో, తలయాజమ్లోని బ్రాయిలర్ కోళ్ల ఫారమ్లో పక్షులు మరణించడంతో వాటి నమూనాలను పరీక్షల కోసం భోపాల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ ల్యాబ్కు పంపారు.
More Stories
అహ్మదాబాద్లో విమాన ప్రమాదంపై అమెరికాలో దావా
శబరిమల ఆలయంలో 4.5 కిలోల బంగారం మాయం
ఇకపై ఈవీఎం బ్యాలెట్ పేపర్పై అభ్యర్థుల కలర్ ఫొటో!