పీఎం-కేర్స్ ఫండ్ ఈ ఏడాది మార్చి నాటికి రెండేళ్ల కాలంలో రూ.13 వేల కోట్లకు పైగా నిధులు సమకూరాయి. మార్చి 31వ తేదీన దాదాపు రూ.5400 కోట్ల బ్యాలెన్స్ కలిగివుంది. మిగతా మొత్తం కరోనాపై పోరాటంలో వివిధ చర్యల కోసం ఖర్చు చేశారు.
ప్రకృతి విపత్తులు కాకుండా ఇతర అత్యవసర పరిస్థితుల్లో వినియోగం కోసం ఈ నిధిని ఏర్పాటు చేశారు. దీనికి ప్రధాన మంత్రి ఎక్స్ ఆఫీసియో చైర్మన్ కాగా, నాలుగు కేంద్ర మంత్రులు సభ్యులుగా ఉన్నారు. దీనికి సమకూరే విరాళాలు అన్నింటికీ ఆదాయ పన్ను నుండి మినహాయింపు లభిస్తుంది.
2021-22కి సంబంధించి పీఎం-కేర్స్ ఫండ్ ఆడిట్ ప్రకటన ప్రకారం, మార్చి 2020లో ఫండ్ ప్రారంభించినప్పటి నుంచి రెండేళ్లలో రూ.13,000 కోట్లకు పైగా వసూలు అయింది. ఈ మొత్తంలో 60 శాతం అంటే దాదాపు రూ. 7700 కోట్లు మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటు, ప్రభుత్వ ఆస్పత్రులకు వెంటిలేటర్లు, తాత్కాలిక ఆస్పత్రుల ఏర్పాటు వంటి వివిధ అంశాలపై ఖర్చు చేశారు.
దేశంలో కరోనా మహమ్మారి ఉధృతంగా విజృంభించిన మునుపటి ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2021-22లో అందుకున్న విరాళాలు గణనీయంగా తగ్గాయి. 2020-21లో దేశీయంగా రూ.7,183 కోట్లు, విదేశాల నుంచి రూ.495 కోట్లు నిధులు రాగా, గత ఆర్థిక సంవత్సరంలో దేశంలో రూ.1897 కోట్లు, విదేశాల నుంచి రూ41 కోట్లు మాత్రమే పీఎం-కేర్స్కు వచ్చాయి.
ఈ ఫండ్కి ప్రారంభ కార్పస్ కింద ప్రధాని నరేంద్ర మోదీ తన వ్యక్తిగత సంపాదన నుంచి రూ.2.25 లక్షలు విరాళం ఇచ్చారు. పీఎం-కేర్స్ ఫండ్ కార్పస్లో ఉన్న మొత్తం నుంచి గత ఆర్థిక సంవత్సరంలో వడ్డీ ఆదాయంగా రూ.160 కోట్లు ఆర్జించినట్లు తెలుస్తోంది. 2020-21లో కూడా ఫండ్లోని కార్పస్పై పీఎం-కేర్స్ ఫండ్ అంతకు ముందు రూ.235 కోట్లను వడ్డీ రూపేనా పొందింది. దీని ప్రకారం గత మార్చి వరకు పీఎం-కేర్స్ ఫండ్లోకి వచ్చిన రూ.13,054 కోట్లలో వడ్డీ ఆదాయం రూ.395 కోట్లుగా ఉన్నది.
ప్రభుత్వ ఆస్పత్రులకు 50 వేల వెంటిలేటర్లకు రూ.835 కోట్లు. మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు రూ.1703 కోట్లు ఖర్చు చేశారు. 99,986 ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల సేకరణకు దాదాపు రూ.500 కోట్లు, నాన్ రీబ్రీదర్ మాస్క్లు, 10 లక్షల అదనపు మాస్క్లతో కూడిన 1.5 లక్షల ఎస్పీఓ2 ఆధారిత ఆక్సిజన్ నియంత్రణ వ్యవస్థల సేకరణకు రూ.322 కోట్లు ఖర్చు చేసినట్లు ఆడిట్ ప్రకటన తెలిపింది.
పీఎం-కేర్స్ ఫండ్ నుండి కనీసం రూ.83 కోట్లు జమ్ము, శ్రీనగర్లలో రెండు 500 పడకల తాత్కాలిక కరోనా ఆస్పత్రుల స్థాపనకు ఖర్చు చేయగా, యూపీలోని లక్నోలో 500 పడకల తాత్కాలిక ఆస్పత్రికి రూ.13 కోట్లు వెచ్చించారు.
పెట్రోలియం మంత్రిత్వశాఖ ద్వారా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ద్రవ ఆక్సిజన్ పరికరాల కొనుగోలు కోసం దాదాపు రూ.190 కోట్లు ఖర్చు చేశారు. 2021-22లో ఢిల్లిలోని 500 ఐసియు పడకల సర్దార్ వల్లభాయ్ పటేల్ కరోనా ఆస్పత్రిని తిరిగి సక్రియం చేయడానికి రూ.68 కోట్లు ఖర్చు చేశారు.
More Stories
రాజ్యాంగం మారుస్తామని కాంగ్రెస్ అసత్య ప్రచారం
మసాలా సుగంధ ద్రవ్యాలపై దేశవ్యాప్తంగా తనిఖీలు
బీజేపీ గెలుపు మన దేశానికి అవసరం