”సలామ్ హారతి” స్థానంలో ”నమస్కార”

అలనాటి మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్ కర్నాటకలోని హిందూ దేవాలయాలలో ప్రారంభించిన ”సలామ్ హారతి” సాంప్రదాయానికి ముగింపు పలకాలని కర్ణాటకలోని బిజెపి ప్రభుత్వం నిర్ణయించింది. దాని స్థానంలో నమస్కార పేరిట మరో పూజను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రాష్ట్ర హిందూ మత సంస్థలు, దేవాదాయ ధార్మిక శాఖ పరిధిలోని కర్నాటక ధార్మిక పరిషత్ ఈ నిర్ణయం తీసుకొంది.  తన పాలనలోని మైసూరు రాజాజ్య ప్రజల సుఖసంతోషాల కోసం అప్పటి మైసూరు రాజు టిప్పు సుల్తాన్ ఆలయాలలో ఈ పూజను ప్రారంభించారు.
 బ్రిటిష్ సేనలతో జరిగిన యుద్ధంలో టిప్పు మరణించిన తర్వాత కూడా రాష్ట్రంలోని వివిధ హిందూ ఆలయాలలో ఈ సాంప్రదాయం కొనసాగుతోంది.  గతంలో రాష్ట్ర పాలనా యంత్రాంగం సంక్షేమం కోసం ఆలయాలలో ఈ క్రతువు జరిగేదని, ఇక నుంచి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం నమస్కార పేరిట ఆలయాలలో పూజలు జరుగుతాయని పరిషత్ సభ్యుడు కాషెకోడి సూర్యనారాయణ భట్ తెలిపారు.
ఒకప్పటి మైసూరు రాజ్యంలోని పుత్తూరు, సుబ్రమణ్య, కొల్లూరు, మేల్కోటే, తదితర ప్రాంతాల్లోని ప్రసిద్ధ ఆలయాలలో ఈసలామ్ హారతి నిర్వహించడం జరుగుతోంది.  కాగా..దీన్ని బానిసత్వానికి చిహ్నంగా హిందూ సంస్థలు అభివర్ణిస్తూ దీన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే మేధావులు మాత్రం ఇది హిందూ, ముస్లిం ప్రజల మధ్య సామరస్యానికి ప్రతీకని, సాంప్రదాయం కొనసాగాలని అభిలషిస్తున్నారు.