ఢిల్లీ మద్యం కుంభకోణంలో తొలి ఛార్జ్‌షీట్

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీబీఐ అధికారులు తొలి ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. 10 వేల పేజీల ఛార్జ్‌షీట్‌ను సీబీఐ దాఖలు చేసింది. ఈ కేసులో నిందితులైన హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అభిషేక్‌ బోయినపల్లి, విజయ్‌ నాయర్‌‌లపై అధికారులు ఛార్జ్‌షీట్ వేశారు.
మొదటి అరెస్ట్ జరిగిన నాటి నుంచి 60 రోజుల్లోపు ఛార్జ్‌షీట్ దాఖలు చేయాల్సి ఉంటుంది.. ఆ గడువు నేటి (శుక్రవారం)తో ముగియనుండటంతో ట్రయల్‌ కోర్టు ముందు సీబీఐ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఎక్సైజ్‌ శాఖ డిప్యూటీ కమిషనర్‌ కుల్‌దీప్‌ సింగ్‌, ఎక్సైజ్‌ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ నరేంద్ర సింగ్‌ పేర్లను కూడా ఛార్జ్‌షీటులో పేర్కొంది.
ఛార్జ్‌షీట్‌లో ఎ 1-కుల్‌దీప్‌ సింగ్‌, ఎ 2-నరేంద్ర సింగ్, ఎ 3-విజయ్ నాయర్, ఎ 4-అభిషేక్ బోయినపల్లి పేర్లు చేర్చింది. కేసు దర్యాప్తు ఆధారంగా రానున్న రోజుల్లో మరికొన్ని ఛార్జ్‌షీట్లు దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదే వ్యవహారంలో ఒకట్రెండు రోజుల్లో ఈడీ కూడా ఛార్జ్‌షీట్ దాఖలు చేయనున్నట్లు దర్యాప్తు సంస్థ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీబీఐ వేసిన ఛార్జ్‌షీట్‌లో పలు అంశాలు పేర్కొంది. సాక్షులు ఇచ్చిన సమాచారం, ఆధారాలను ఛార్జ్‌షీట్‌కు అనుబంధంగా కోర్టుకు సమర్పించింది. ఇక సీఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపిన వస్తువుల రిపోర్ట్స్ రావాల్సి ఉందని తెలిపింది. మొత్తం ఏడుగురిపై ఛార్జ్‌షీట్ దాఖలు చేసినట్లు వెల్లడించింది.
అయితే ఇందులో అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్లను మాత్రం అరెస్ట్ చేసినట్లు చూపించింది. మిగతా ఐదుగురిని అరెస్ట్ చేయలేదని ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. ప్రస్తుతం అరెస్టైన ఇద్దరికీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.