ఆయుధాల వ్యాపారి సంజయ్ భండారీ భారత్ కు!

ఆయుధాల వ్యాపారి సంజయ్ భండారీ భారత్ కు!

పన్ను ఎగవేత, లంచంలకు సంబంధించిన కేసుల్లో భారత్‌కు కావలసిన ఆయుధాల డీలర్ సంజయ్ భండారీని ఇంగ్లాండ్ నుంచి భారత్‌కు అప్పగించనున్నారు. అతడిని భారత్‌కు అప్పగించాలని లండన్‌లోని వెస్ట్‌మినిష్టర్ మెజిస్ట్రేట్ కోర్టు అనుమతించింది.

సంజయ్‌ భండారీపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ (ఈడీ) మనీలాండరింగ్‌ కేసును విచారిస్తున్నది. యూకేలో ఉన్న సంజయ్‌ భండారీని భారత్‌కు రప్పించేందుకు ఈడీ చాలా రోజులుగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. భారత ప్రభుత్వం తరఫున యూకే కోర్టులో ఈ కేసును వాదించిన ఈడీ చివరకు విజయం సాధించింది.

సంజయ్‌ భండారీపై నల్లధనం సహా పలు సెక్షన్ల కింద ఆదాయం పన్ను అధికారులు చేసిన ఫిర్యాదు మేరకు 2020 జూన్‌ 1న ఈడీ ఛార్జిషీట్‌ నమోదు చేసింది. అదేవిధంగా సంజయ్‌ భండారీపై పన్ను ఎగవేతతోపాటు ఆయుధాల ఒప్పందంలో ముడుపులు అందాయన్న కేసు నమోదైంది. దాంతో ఆయన ఇండియా నుంచి పారిపోయి యూకేలో తలదాచుకున్నాడు.

ఆయనను భారత్ కు రప్పించేందుకు ఈడీ అధికారులు బ్రిటన్‌ వెస్ట్‌మినిస్టర్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసి.. సంజయ్‌ భండారీని తమకు అప్పగించాలని కోరింది. కేసును విచారించిన యూకే కోర్టు సంజయ్ భండారీని భారతదేశానికి అప్పగించేందుకు అనుమతినిచ్చింది. అయితే, వెస్ట్‌ మినిస్టర్‌ కోర్ట్‌ ఆదేశాలను యూకే ఉన్నత న్యాయస్థానంలో సంజయ్‌ భండారీ సవాలు చేసే అవకాశాలున్నాయి.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం రూ. 2,895 కోట్ల విలువ చేసే 75 పిలాటస్ బేసిక్ ట్రైనర్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల కొనుగోలు ఒప్పందంలో అవినీతికి సంబంధించి సంజయ్ భండారీపై 2019 లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కూడా కేసు నమోదు చేసింది.

ఆఫ్‌సెట్ ఇండియా సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్‌లైన సంజయ్‌ భండారీ, బిమల్ సరీన్‌లతో స్విట్జర్లాండ్‌కు చెందిన పిలాటస్ ఎయిర్‌క్రాఫ్ట్ లిమిటెడ్ సంస్థ నేరపూరిత కుట్రకు పాల్పడిందని, 2010 జూన్‌లో భండారీతో మోసపూరితంగా సర్వీస్ ప్రొవైడర్ ఒప్పందం కుదుర్చుకున్నారని సీబీఐ ఆరోపించింది.

ఇది డిఫెన్స్ ప్రొక్యూర్‌మెంట్ ప్రొసీజర్, 2008 కింద ఉల్లంఘన జరిగినట్లు సీబీఐ ఆరోపించింది. 2015 జూలై 1 నుంచి 2017 ఫిబ్రవరి 7 మధ్యకాలంలో సంజయ్ భండారీ తన విదేశీ సంపదను ఆదాయపు పన్ను అధికారులకు తెలుపకుండా మోసగించాడని ఆరోపణ. అతడు ప్రపంచవ్యాప్తంగా తనకున్న సంపదపై ఆదాయపు పన్ను కట్టాల్సి ఉంది.

అన్‌డిస్‌క్లోజ్డ్ అసెట్స్ కింద అతడు మినహాయింపు పొందడానికి కూడా అవకాశంలేదు.  అతడు తన విదేశీ సంపద, ఆదాయాన్ని తెలుపకుండా దాచాడు. అతడు మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణ.  దుబాయ్‌లోని అతడి బ్యాంకు ఖాతాకు రూ. 2895 కోట్లు స్విస్ విమాన తయారీ సంస్థ చెల్లించిందని తెలుస్తోంది.

సిబిఐ, ఈడి రెండూ అతడిపై భారత్‌లో కేసులు పెట్టాయి. భండారీ 2016లో దేశం నుంచి పరారి అయ్యాడు. అతడిపై లుకౌట్ నోటీసు కూడా జారీ అయింది.  అతడిని అప్పగింత వారంట్‌పై 2020 జూలై 15న లండన్‌లో అరెస్టు చేశారు.

భండారీకి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త అయిన రాబర్ట్ వాద్రాతో వ్యాపార సంబంధాలున్నట్లు సమాచారం. అయితే భండారీతో తనకెలాంటి సంబంధాలు లేవని రాబర్ట్ వాద్రా ఖండిస్తున్నారు.