మాజీ మంత్రి నారాయణను 30 రోజుల్లో లొంగిపొమ్మన్న కోర్టు

మాజీ మంత్రి నారాయణను 30 రోజుల్లో లొంగిపొమ్మన్న కోర్టు

ప‌దో త‌ర‌గ‌తి ప్ర‌శ్న ప‌త్రాల లీకేజీ కేసులో ఏపీ మాజీ మంత్రి నారాయణకు చిత్తూరు కోర్టు  బెయిల్ రద్దు చేస్తూ ఆర్డ‌ర్ ఇచ్చింది. నవంబర్ 30వ తేదీ లోపు పోలీసులకు లొంగిపోవాలని ఆదేశించింది.  నారాయణ బెయిల్ రద్దు చేయాలని చిత్తూరు వన్ టౌన్ పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు.

ఈ పిటిషన్ పై విచారర‌ణ జ‌రిపిన‌ కోర్టు బెయిల్ రద్దు చేస్తూ ఆదేశాలిచ్చింది. పదో త‌ర‌గ‌తి ప్రశ్నా పత్రాల లీకేజీ కేసులో మొత్తం 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులు, మిగిలిన వారు నారాయణ విద్యా సంస్థ‌ల‌ సిబ్బంది ఉన్నారు. ఈ కేసులో మాజీ మంత్రి, టీడీపీ నేత నారాయణను చిత్తూరు పోలీసులు ఈ ఏడాది ఏప్రిల్‌లో అరెస్టు చేశారు. అనంతరం కోర్టు అయనకు బెయిల్ మంజూరు చేసింది.

అయితే కింది కోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని పోలీసులు చిత్తూరు కోర్టులో మరో పిటిషన్ వేశారు.  దీనిపై సోమ‌వారం విచారణ జరిపిన కోర్టు నారాయణ బెయిల్ రద్దు చేస్తూ నవంబర్ 30వ తేదీ లోపల పోలీసుల ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం నెల్లేపల్లిలోని హైస్కూల్‌ నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌ 27న పదోతరగతి ఎగ్జామ్ పేపర్ లీకైంది.

వాట్సాప్‌ ద్వారా తెలుగు పేపర్ లీక్ అవ్వడంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణ పాత్ర ఉన్నట్లు చిత్తూరు పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం నారాయణను హైద‌రాబాద్‌లో అరెస్ట్‌ చేసి చిత్తూరు కోర్టులో హాజరుపరిచారు.

ఈ క్ర‌మంలో నారాయణ విద్యాసంస్థల అధినేతగా 2014లోనే ఆయన వైదొలిగారని ఆయన తరఫు లాయర్లు కోర్టుకు తెలిపారు. దానికి సంబంధించిన ఆధారాలు కూడా సమర్పించారు. అప్పట్లో కోర్టు నారాయణకు బెయిల్‌ మంజూరు చేసింది. దీనిపై ఎగువ కోర్టుకు పోలీసులు వెళ్లి పిటిష‌న్ దాఖ‌లు చేయాగా ఆ బెయిల్ ను పై కోర్టు రద్దు చేసింది.

పదో తరగతి పరీక్షల సమయంలో నారాయణ విద్యాసంస్థల్లో పని చేసే ఓ ఉపాధ్యాయుడు పేపర్ లీక్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఎగ్జామ్ మొదలైన గంట సేపు తరువాత నిందితుడు ప్రశ్నా పత్రాన్ని సెల్ ఫోన్ తో ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారని పోలీసులు వెల్లడించారు.

ఈ కేసుకు సంబంధించి అప్పట్లో నారాయణ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు నారాయణ, అలాగే కొంతమంది సిబ్బందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై చిత్తూరు డీఈవోకి అందిన ఫిర్యాదుతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో బృందాలుగా ఏర్పడిన పోలీసులు తొలుత  మాల్ ప్రాక్టీసుకు కారకుడైన నారాయణ స్కూల్ వైస్ ప్రిన్సిపాల్ గిరిధర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించారు.