మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టారు

కేసీఆర్ సర్కార్ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని చెబుతూ తెలంగాణ ఏర్పడే నాటికి రూ.60 వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ గత 9 ఏళ్లలో రూ.5 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టాడని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ విజయశాంతి ఆరోపించారు.  ఇప్పుడే పుట్టిన పసిబిడ్డతోపాటు అందరి నెత్తి మీదా కేసీఆర్ రూ.లక్షన్నర అప్పు పెట్టాడని ఆమె ధ్వజమెత్తారు.
 
అంగన్వాడీ వర్కర్లకు, పారిశుద్ధ్య కార్మికులకు, ఉద్యోగులకు రాష్ట్రంలో జీతాలిచ్చే పరిస్థితి లేదని అంటూ పైకి మాత్రం చిన్న దొర, పెద్ద దొరల గొప్పలకు మాత్రం తక్కువ లేదని ఆమె ఎద్దేవా చేశారు. వీళ్లకు రాష్ట్రాన్ని పాలించడానికి డబ్బులు లేవు కానీ, మునుగోడులో పంచడానికి మాత్రం సూట్‌కేసులలో కోటానుకోట్ల డబ్బులు వస్తాయని ఆమె మండిపడ్డారు. 
 
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, కేసీఆర్ కుటుంబసభ్యులు మునుగోడుకు వస్తూ వస్తూ సూట్‌కేసుల నిండా డబ్బులు, లారీల నిండా బ్రాందీ, విస్కీ… ట్రక్కుల నిండా చికెన్, బిర్యానీ పొట్లాలు తెస్తున్నరని ఆమె ఆరోపించారు. తెలంగాణలో అడుగడుగునా వైన్ షాపులు, బెల్ట్ షాపులు ఓపెన్ చేశారని పేర్కొన్నారు. 
 
రాష్ట్రంలో కేసీఆర్‌కు, ఆయన కొడుక్కి, కూతురికి, అల్లుడికి ఇలా అందరూ ఫామ్ హౌస్‌లు కట్టుకున్నరని అంటూ సొంతంగా విమానం కూడా కొనేందుకు సిద్ధమయ్యారని ఆమె గుర్తు చేశారు. కానీ గ్రామాల్లో ప్రజలకు డబుల్ బెడ్‌రూం ఇండ్లు మాత్రం కట్టివ్వడం లేదని ఆమె వాపోయారు. 
 
“ఈ కేసీఆర్… నేను నిజాం రాజును, నా తర్వాత నా కొడుకు, తర్వాత నా మనవడు, ఆ తర్వాత నా మునిమనవడు ముఖ్యమంత్రి కావాలి తప్ప.. తెలంగాణకు ఇంకెవరూ సీఎం కావొద్దని అనుకుంటున్నాడు. ఈ కేసీఆర్ సర్కార్‌కు త్వరలోనే తెలంగాణ ప్రజానీకం గోరీ కట్టడం ఖాయం.” అని విజయశాంతి హెచ్చరించారు.