మయన్మార్‌లో సైన్యం వైమానిక దాడులలో 80 మంది మృతి

మయన్మార్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపిస్తుండటంతో వారిని అణిచివేసేందుకు సైనిక పాలకులు వైమానిక దాడులకు దిగడంతో ఈ దాడుల్లో దాదాపు 80 మంది మరణించినట్లుగా సమాచారం. మృతుల్లో ఒక గాయకుడితోపాటు వ్యాపారవేత్తలు, సామాన్య పౌరులు కూడా ఉన్నారు.
క్షతగాత్రులను స్థానిక దవాఖానకు తరలించారు. కచిన్‌ రాష్ట్రంలో జరుపుకుంటున్న వేడుకలపై సైన్యం విరుచుకుపడటంతో మారణకాండ చోటుచేసుకున్నది. ఈ దాడిలో 80 మంది మరణించగా, దాదాపు 100మందికి పైగా గాయపడ్డారని కచిన్‌ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధి మీడియాకు వెల్లడించారు.
ఆదివారం సాయంత్రం కచిన్‌ స్వతంత్ర సంస్థ స్థాపన వేడుక జరుపుకునేందుకు సుమారు 300 నుండి 500 మంది హాజరైన ఓ కార్యక్రమంపై మిలటరీ యుద్ధవిమానం నాలుగు బాంబులను జారవిడించిందని తెలిపారు. ఈ దాడిలో కచిన్‌ మిలటరీ అధికారులు, సైనికులు సహా సంగీతకారులు, జాడే మైనింగ్‌ వ్యాపారులు, యజమానులు, ఇతర పౌరులు, వంటవారు కూడా ఉన్నారని ఆయన తెలిపారు.
మూడు జెట్‌ ఫైటర్లతో సైన్యం నాలుగు బాంబులు జారవిడిచింది. గత ఏడాది ఫిబ్రవరిలో ఆంగ్‌సాన్‌ సూకీ నుంచి అధికారాన్ని హస్తగతం చేసుకున్న అనంతరం సైన్యం జరిపిన దాడుల్లో ఇది అతి పెద్దదిగా చెప్పవచ్చు. ఆర్మీ సైనిక శిక్షణ కోసం ఉపయోగించే హపకాంత్‌ టౌన్‌షిప్‌లోని ఆంగ్‌ బార్లే గ్రామానికి సమీపంలో దాడులు జరిగాయి.
మయన్మార్‌లో విస్తృతంగా జరుగుతున్న హింసాకాండపై చర్చించేందుకు ఆగ్నేయాసియా దేశాల విదేశాంగ మంత్రులు ఇండోనేషియాలో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్న మూడు రోజుల ముందుగా ఈ దాడులు జరుగడం గమనార్హం.
కాగా, కచిన్ ఇండిపెండెన్స్ ఆర్మీ 9వ బ్రిగేడ్ ప్రధాన కార్యాలయంపై దాడి జరిగినట్లు మిలటరీ ప్రభుత్వ సమాచార కార్యాలయం సోమవారం అర్థరాత్రి ఒక ప్రకటనలో ధ్రువీకరించింది. కచిన్ గ్రూపు ఉగ్రవాద చర్యలకు ప్రతిస్పందనగా ఈ ఆపరేషన్ చేపట్టినట్లుగా పేర్కొనడం విశేషం.
మయన్మార్‌లోని అధికారిక జుంటా సైన్యం యుద్ధ నిబంధనలను ఉల్లంఘించిందని మానవహక్కుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దేశానికి ఆయుధాలు, విమాన ఇంధన విక్రయంపై నిషేధం విధించాలని ప్రపంచదేశాలకు పిలుపునిచ్చాయి.