జనసేన-బీజేపీ కలిసి పోటీ చేస్తాయి 

వచ్చే ఎన్నికల్లో జనసేన-బీజేపీ కలిసి పోటీ చేస్తాయని ఏపీ బీజేపీ ఇన్‌చార్జ్‌ సునీల్‌ దియోధర్‌ ప్రకటించారు. తమ మిత్రపక్షం జనసేన బీజేపీకి దూరమై తెలుగుదేశం పార్టీకి దగ్గరవుతోందని విస్తృతంగా ప్రచారం జరుగుతున్న సందర్భంలో దేవధర్ తమ పార్టీ వైఖరిని పునరుద్ఘాటించారు.
 
శనివారం ఢిల్లీలోని తన నివాసంలో నిర్వహించిన ‘దివాలి మిలన్’ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ టీడీపీతో పొత్తు పెట్టుకోమని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీతో తాము గతంలో పొత్తు పెట్టుకుని చేదు అనుభవాలు చవిచూశామని పేర్కొంటూ ఈ పరిస్థితుల్లో ఆ పార్టీతో పొత్తు ప్రసక్తే లేదని తేటతెల్లం చేశారు. 
 
రాష్ట్రంలోని తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు రెండూ అవినీతి, కుటుంబ పార్టీలేనని దేవధర్ విమర్శించారు. మరోవైపు బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలు, వ్యాఖ్యలపై స్పందన కోరగా జనసేనతో రోడ్ మ్యాప్ విషయంలో ఎలాంటి గందరగోళం లేదని స్పష్టం చేశారు.  దాని గురించి అంతర్గతంగా చర్చించుకుంటామని తెలిపారు.
 
 అయితే రోడ్‌ మ్యాప్ గురించి పవన్ మీడియాలో మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పారు.  కాగా,  రాష్ట్ర బీజేపీలో సోము వీర్రాజు విఫలమయ్యారంటూ ఆ పార్టీ కీలక నేత కన్నా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలపై తాము సీరియస్‌గా తీసుకోవడం లేదని సునీల్‌ దియోధర్‌ తెలిపారు. 
 
పార్టీలో ఈ తరహా అసంతృప్తులు సహజమేనని తెలిపారు.  పైగా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మధ్య ఎలాంటి విబేధాలు లేవని వివరించారు.