ఒమిక్రాన్ వేరియంట్‌తో తిరిగి కరోనా వైరస్ ఉధృతి

ఒమిక్రాన్ వేరియంట్‌తో తిరిగి కరోనా వైరస్ ఉధృతి

ఒమిక్రాన్ వేరియంట్‌తో తిరిగి కరోనా వైరస్ ఉధృతి తలెత్తుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్‌ఒ) చీఫ్ సైంటిస్టు సౌమ్య స్వామినాథన్ హెచ్చరించారు. ఇప్పటికే కొన్ని దేశాలలో తిరిగి కరోనా తీవ్రత సంకేతాలు వెలువడ్డాయని తెలిపారు. 

పుణేలో ఓ సదస్సుకు హాజరు అయ్యేందుకు వచ్చిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒమిక్రాన్ కరోనా వైరస్‌కు మరో రూపంగా తలెత్తిందని,  దీనికి సంబంధించి ఉత్పన్నం అయిన ఎక్స్‌ఎక్స్‌బి ఉప రకాలతో తిరిగి మరోసారి కరోనావేవ్ వస్తోందని, వీటి పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని భారతీయ క్లినికల్ సైంటిస్టు కూడా అయిన ఆమె విశ్లేషించారు. 

అయితే ఇంతకు ముందటి రకాలతో పోలిస్తే ఈ రకాలతో తీవ్రస్థాయి ముప్పువనే విషయం తెలియ చేయడానికి ఎటువంటి వైద్యపరమైన రికార్డులు ఏ దేశంలోనూ అందుబాటులో లేవని ఆమె వివరించారు. అయితే ఇటీవల కాలంలో తిరిగి కరోనాను పోలిన వైరస్ లక్షణాలు తలెత్తిన కేసులు ఎక్కువ సంఖ్యలో కొన్ని దేశాలలో నమోదు అవుతున్నాయని తెలిపారు. 

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో ఇప్పటికిప్పుడు బిఎ 5, బిఎ 1 వైరస్‌లపై అధ్యయనాలు నిర్వహిస్తోంది. ఈ వైరస్‌లు ఇంతకు ముందటి వైరస్‌తో పోలిస్తే ఎక్కువగా వ్యాపించేవి, రోగనిరోధకతను కూడా ఛేదించే శక్తితో ఉన్నాయని ఆమె తెలిపారు. కరోనా వైరస్ పలు మార్పులకు గురవుతోంది. ఈ క్రమంలో ఇది మరింత వ్యాప్తి లక్షణాలను సంతరించుకుందని తెలిపారు.

ఒమిక్రాన్ 300 సబ్ వేరియంట్ల సముదాయపు వైరస్ అయింది. ఇది చాలా ఆందోళనకర పరిణామం. దీనికి తోడుగా ఎక్స్‌ఎక్స్‌బి వచ్చింది. వైరస్‌ల సమ్మిళితంగా ఇది ఉందని తేలిందని సౌమ్య తెలిపారు. మనిషి రోగ నిరోధక శక్తి అత్యంత కీలకం. దీనిని చీల్చుకుంటూ వైరస్ వెళ్లగల్గితే అది మనిషికి మరింత ముప్పుగా మారుతుందని హెచ్చరించారు.

ఏ దేశంలో కూడా కరోనా నియంత్రణ పద్ధతులు పూర్తి స్థాయిలో కొనసాగాల్సిందే. వైరస్ సమసిపోయిందనే స్తబ్ధత తిరిగి ఇతరత్రా సంబంధిత వైరస్‌లదాడికి మరోమారు మహమ్మారి ఉధృతికి దారితీస్తుందని ఆమె ప్రభుత్వాలకు, సామాజిక సంస్థలకు తెలిపారు.