వచ్చే ఏడాది మొదట్లో సెర్వైకల్‌ క్యాన్సర్‌ నిరోధక టీకా

సెర్వైకల్‌ క్యాన్సర్‌ నిరోధం కోసం దేశీయంగా అభివృద్ధి చేసిన తొలి క్వాడ్రివాలెంట్‌ వ్యాక్సిన్‌ సెర్వవాక్‌ ఉత్పత్తిని వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో ప్రారంభించనున్నట్లు సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సీఈవో అదార్‌ పూనావాలా వెల్లడించారు.  కరోనా మహమ్మారి కారణంగా ఈ వ్యాక్సిన్‌ ఉత్పత్తిని మొదలుపెట్టడం ఆలస్యమైందని ఆయన మీడియాకు తెలిపారు.
సెర్వైకల్‌ క్యాన్సర్‌కు కారణమయ్యే హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌ (హెచ్ పి వి)ను కట్టడి చేయడంలో ఈ వ్యాక్సిన్‌ కీలకంగా పనిచేస్తుందని పూనావాలా చెప్పారు.  ఈ వ్యాక్సిన్‌ను విదేశాలకు కూడా ఎగుమతి చేయనున్నట్లు ఆయన తెలిపారు. 2024లో యూనిసెఫ్‌తోపాటు ఆఫ్రికా దేశాలకు వ్యాక్సిన్‌ను ఎగుమతి చేస్తామన్నారు. అక్కడ గత కొన్నేండ్లుగా హ్యూమన్ పాపిలోమా వైరస్‌ (హెచ్ పి వి) వ్యాక్సిన్‌ లోటు ఉందని చెప్పారు.
సెర్వవాక్స్‌ వ్యాక్సిన్‌ ఉత్పత్తికి డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) ఇప్పటికే లైసెన్స్‌ ఇచ్చిందని పూనావాలా తెలిపారు. ఉత్పత్తి ప్రారంభమైన తర్వాత ప్రతినెల పది లేదా ఇరవై లక్షల డోసులను ప్రభుత్వానికి సరఫరా చేయనున్నట్లు చెప్పారు. వ్యాక్సిన్‌ను తక్కువ ధరకే అందిస్తామని, కేంద్ర ప్రభుత్వంతో చర్చించి కచ్చితమైన ధరను నిర్ణయిస్తామని ఆయన పేర్కొన్నారు.

కరోనా టీకా ఉత్పత్తి నిలిపివేత 

ఇలా ఉండగా కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో ప్రపంచ వ్యాప్తంగా విశేష  ఆదరణ పొందిన టీకా కొవిషీల్డ్ ఉత్పత్తిని గత డిసెంబర్ నుండి నిలిపివేసిన్నట్లు పూనావాలా తెలిపారు. అప్పటికే పేరుకుపోయిన 100 మిలియన్ డోస్ ల నిల్వల  కాలపరిమితి మురిగిపోయిందని చెప్పారు. కరోనా, టీకాల పట్ల ప్రజలలో విసుగు  నెలకొనడంతో వాటి పట్ల వారిలో అనాసక్తి పెరుగుతున్నట్లు ఆయన భావిస్తున్నారు.

కాగా,  ప్రస్తుతం వ్యాపిస్తున్న ఓమిక్రాన్ సబ్ వేరియంట్ లకు కొత్త టీకాల తయారీకి కొంత సమయం పడుతుందని పేర్కొన్నారు. కరోనా బూస్టర్ టీకా కావోవాక్స్ కు మరో పక్షం రోజులలో డిసిజిఐ అనుమతి లభించగలదని భావిస్తున్నట్లు తెలిపారు.