
రాజ్యాంగ నిబంధనల ప్రకారమే గోవా అధికార బీజేపీలో ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్ఎల్ఎలు ఇటీవల విలీనం అయ్యారని గోవా అసెంబ్లీ స్పీకర్ తవాడ్కర్ వెల్లడించారు. ఇటీవల కాలంలో రాజకీయ పరిణామాలు చాలా శక్తివంతంగా మారాయని, ఎమ్ఎల్ఎలు తమ నియోజక వర్గాల్లో తమ పదవీకాలంలో మొత్తం అభివృద్ధి జరగాలని ఆకాంక్షిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
సెప్టెంబర్ 14న గోవాలోని మొత్తం 11 మంది కాంగ్రెస్ ఎమ్ఎల్ఎల్లో 8 మంది అధికార పార్టీ బీజేపీలో చేరారు. కాంగ్రెస్ శాసన సభా పక్షాన్ని బీజేపిలో విలీనం చేసేందుకు వీలుగా తీర్మానాన్ని ఆమోదించారు కూడా. కాంగ్రెస్ లోని రెండింట మూడొంతుల మంది ఎమ్ఎల్ఎలు ఆ పార్టీ నుంచి విడిపోయి బీజేపీలో చేరారని, ఇదంతా రాజ్యాంగ నిబంధనల ప్రకారమే జరిగిందని స్పీకర్ వివరించారు.
కాంగ్రెస్లో ఈ చీలిక జరిగినప్పుడు తాను ఢిల్లీలో ఉన్నానని, అదే రోజు గోవా రాజధాని పనాజికి వచ్చి, లాంఛనాలన్నీ పూర్తి చేశానని చెప్పారు. అకస్మాత్తుగా కాంగ్రెస్ వారు ఈ నిర్ణయం తీసుకుంటారని తాను ముందుగా ఊహించినట్టుగానే జరిగిందని చెప్పారు. ఒకపార్టీ టిక్కెట్పై పోటీ చేసి మరోపార్టీ లోకి ఎలాంటి ఎన్నికలు లేకుండా చేరడం ప్రజాస్వామ్యంలో ఆరోగ్యకరమైన సంప్రదాయమా? అన్న ప్రశ్నకు తమ కాంగ్రెస్ పార్టీ తమకు న్యాయం చేయలేదని వారు భావించి ఉండవచ్చని, అందుకే ఆ పార్టీ విడిచి బిజేపిలో చేరారని పేర్కొన్నారు.
40 మంది సభ్యులున్న గోవా అసెంబ్లీలో విపక్షాల బలం ఏడుకు తగ్గిపోవడంపై అడగ్గా, విపక్షాల సంఖ్య తక్కువే అయినప్పటికీ, సభలో వారు మాట్లాడడానికి చాలా అవకాశం కల్పిస్తామని చెప్పారు. రెండు వైపులా సమానంగా అవకాశాలు లభించేలా ప్రయత్నిస్తామని తెలిపారు. రానున్న అసెంబ్లీ సమావేశాలు సుదీర్ఘ కాలం జరుగుతాయని, దీనివల్ల కొత్తగా ఎన్నికైన శాసన సభ్యులు శాసన సభ సమావేశాల గురించి తెలుసుకోగలుగుతారని, చర్చల్లో సమర్ధంగా పాల్గొనగలుగుతారని అభిప్రాయ పడ్డారు.
More Stories
బీఎస్ఎన్ఎల్ స్వదేశీ 4జీ నెట్వర్క్ ప్రారంభించిన ప్రధాని మోదీ
ముస్లిం మతగురువు తౌకీర్ రాజా అరెస్టు
‘ఐ లవ్ మహమ్మద్’ వివాదంతో బరేలీలో పెద్ద ఎత్తున అల్లర్లు