`ఆదిపురుష్’ చిత్రం యూనిట్ కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

`ఆదిపురుష్’ చిత్రం యూనిట్ కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

‘ఆదిపురుష్‌’ సినిమాపై వివాదాలు ముసురుకుంటున్నాయి.ప్రభాస్‌ రాఘవుడిగా నటించిన ‘ఆదిపురుష్‌’ సినిమా విడుదలకు ముందే వివాదాలకు ఆజ్యం పోస్టున్నది. హిందూ దేవతలను అవమానించేలా ఈ సినిమా చిత్రీకరణ జరిపారంటూ పలు ప్రాంతాల్లో నిరసనలు మిన్నంటుతున్నాయి. 

రాముడి, రావణాసురుడి పాత్రలను అపహాస్యం చేసేలా చిత్రాన్ని రూపొందించారని నెటిజన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. అయోధ్య రామాలయం పూజారి కూడా సినిమా విడుదల కాకుండా చూడాలన్నారు. వివాదాలు కొనసాగుతుండగానే తాజాగా ఢిల్లీ హై కోర్టు చిత్ర యూనిట్‌కు షాకిచ్చింది.

ఈ సినిమా హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉందని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. చిత్ర బృందంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ న్యాయవాది ఆశిష్ రాయ్ పిటిషన్ దాఖలు చేశారు. చిత్ర నిర్మాత భూషణ్ కుమార్, ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్‌లకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మూవీ విడుదల కాకుండా చూడాలని కోరారు. దీంతో ఢిల్లీ హై‌కోర్టు మూవీ యూనిట్‌కు నోటీసులు పంపించింది.  

ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం ఆదిపురుష్ లో కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రలు పోషించారు. ఓం రౌత్ దర్శకత్వం వహించాడు. రామాయణాన్ని ఆధారంగా చేసుకుని ఈ మూవీని నిర్మించారు. రూ.500కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందించారు.  ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్‌ను మొదలుపెట్టారు. అయోధ్యలో అక్టోబర్ 2న టీజర్‌ను అయోధ్యలో విడుదల చేశారు.

 సనాతన్‌ సెన్సార్‌ బోర్డు ఏర్పాటు చేయాలి 

ఇలా ఉండగా, సినిమాలను సెన్సార్‌ చేసి విడుదలకు అనుమతినిచ్చే సెన్సార్‌ బోర్డు మాదిరిగా మైథోలాజికల్‌ సినిమాలు కూడా విడుదల చేసేందుకు స్క్రీన్‌ చేసేందుకు సనాతన్‌ సెన్సార్‌ బోర్డును ఏర్పాటు చేయాలని రాజస్థాన్‌ మంత్రి ప్రతాప్‌ సింగ్‌ కఛారివాస్‌ డిమాండ్ చేస్తున్నారు. 

సనాతన్‌ సెన్సార్‌ బోర్డు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలంటూ ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి ప్రతాప్‌సింగ్‌ లేఖ రాశారు.  అఖిల భారత సంత్‌ సమితి ఇప్పటికే ఇలాంటి డిమాండ్‌ను ప్రభుత్వం ముందుంచింది. సనాతన్‌ సెన్సార్‌ బోర్డును ఏర్పాటు చేయాలని సంత్‌లు చేస్తున్న ఆందోళనకు సంపూర్ణ మద్ధతు ఇస్తున్నట్లు రాజస్థాన్‌ మంత్రి ప్రతాప్‌ సింగ్‌ తెలిపారు.