మద్యం కుంభకోణంలో `ఆంధ్రప్రభ’లో ఈడీ సోదాలు

మద్యం కుంభకోణంలో `ఆంధ్రప్రభ’లో ఈడీ సోదాలు
హైదరాబాద్‌లోని `ఆంధ్రప్రభ’ దినపత్రిక కార్యాలయంలో నిర్వహించిన ఈడీ దాడుల్లో మద్యం కుంభకోణానికి సంబంధించి లభించిన ఆధారాలు టీఆర్‌ఎస్ పార్టీ, వారి కుటుంబ సభ్యుల మీడియా మేనేజ్‌మెంట్‌ను బట్టబయలు చేస్తున్నాయని బిజెపి ఆరోపించింది. `ఆంధ్రప్రభ’తో పాటు, అదే యాజమాన్యంపై చెందిన ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ `ఇండియా ఎహెడ్’ కార్యాలయంలో కూడా సోదాలు నిర్వహించినట్లు చెబుతున్నారు. 
 
మద్యం కుంభకోణంలో పంజాబ్‌లోని ఆప్ ప్రభుత్వం ఈ మీడియా హౌస్‌కి రూ. 20 కోట్లు బదిలీ చేసింది అన్న ఆరోణలున్నాయని బీజేపీ  రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్ వి సుభాష్ తెలిపారు. `ఆంధ్రప్రభ’లో పెట్టుబడులు పెట్టిన అభిషేక్ రెడ్డి సీఎం కేసీఆర్ కుమార్తెకు అత్యంత సన్నిహితుడు అన్న విషయం వాస్తవం అని ఆయన స్పష్టం చేశారు.
టిఆర్ఎస్ అధినాయకత్వం రాష్ట్రంలో జరుగుతున్న ఈడీ దాడులు రాష్ట్ర ప్రభుత్వం చేసిన అవినీతి, టిఆర్ఎస్ నాయకులు చేస్తున్న అక్రమాలు అవినీతి బయటపడుతున్నాయని ఆయన ధ్వజమెత్తారు.  వివిధ దాడుల్లో దొరికిన సొమ్ములో టిఆర్ఎస్ పార్టీ ఆది నాయకులకు సంబంధాలు ఉన్నట్టు ఆరోపణలు వస్తున్న దృష్ట్యా టిఆర్ఎస్ ప్రభుత్వం వాస్తవాలను బహిర్గతం చేయాలని సుభాష్ డిమాండ్ చేశారు.
 
ఇలా ఉండగా, ఈ కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన ఇద్దరు వ్యక్తుల్లో ఒకరైన అర్జున్‌ పాండే ఆంధ్రప్రభ యాజమాన్యం ఏర్పాటు చేసిన ఆంగ్ల వార్తా చానెల్‌ ‘ఇండియా అహెడ్‌’కు గతంలో కొంతకాలం సేల్స్‌ విభాగాధిపతిగా పని చేశారు. మరొకరు బోయినపల్లి అభిషేక్‌ ‘ఆంధ్రప్రభ-ఇండియా అహెడ్‌’లో పెట్టుబడులు పెట్టారు. వారిద్దరితో ఆంధ్రప్రభకు ఉన్న సంబంధం నేపథ్యంలో పత్రికాధిపతి ముత్తా గోపాలకృష్ణను శుక్రవారం ఈడీ ప్రశ్నించింది. 
 
ముత్తా కుటుంబం నిర్వహిస్తున్న ఆంగ్ల చానెల్‌కు అర్జున్‌ పాండేకు ఉన్న సంబంధాలపై ఈడీ అధికారులు ఆరా తీశారు. తెలంగాణలో అధికార పార్టీ ముఖ్యనేతలకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న బోయిన్‌పల్లి అభిషేక్‌ ఇల్లు, కార్యాలయాల్లో ఈడీ ఇదివరకు సోదాలు నిర్వహించింది. తాజాగా ఈడీ జరిపిన దాడుల్లో ఇండియా అహెడ్‌ సంస్థలోనూ అభిషేక్‌ డైరెక్టర్‌గా ఉన్నట్లు తేలింది. ముత్తా గౌతంతోపాటు అభిషేక్‌ జేఈయూఎస్‌ నెట్‌వర్కింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు. ఇండియా అహెడ్‌లో అభిషేక్‌ పెట్టుబడులకు సంబంధించి పక్కా ఆధారాలు సేకరించిన ఈడీ పత్రిక అధినేత గోపాలకృష్ణను విచారించినట్లు సమాచారం.