
భారత సైనిక విభాగానికి చెందిన ఓ అధికారిపై పాకిస్థాన్ మహిళ వలపు వల విసిరిన ఉదంతం ఆగ్రా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలోని సికంద్రా ప్రాంతానికి చెందిన ఇమామి ఖాన్ రూర్కీలోని ఆర్మీ కార్యాలయంలో అకౌంట్స్ ఆఫీసర్ (గ్రూప్ డి)గా పనిచేస్తున్నాడు.
ఆర్మీ అకౌంటెంట్ ఇమామీఖాన్ పాక్ మహిళ హనీట్రాప్లో పడి, భారత ఆర్మీకి చెందిన రహస్య సమాచారాన్ని లీక్ చేశారని ఆర్మీ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో తేలింది. పాకిస్థాన్ దేశానికి చెందిన ఒక మహిళకు మనదేశ ఆర్మీ రహస్య సమాచారాన్ని బదిలీ చేశాడని గుర్తించిన తరువాత, ఆర్మీ ఇంటలిజెన్స్ ఖాన్ ను అరెస్టు చేసింది.
గత మే నెలలో ఇమామీఖాన్ ను ఆన్లైన్లో ఒక పాకిస్థానీ మహిళ హనీ-ట్రాప్ చేయడంతో అతను సాయుధ దళాల గురించి రహస్య సమాచారాన్ని వెల్లడించాడని సమాచారం. ఆర్మీ ఇంటెలిజెన్స్ ఖాన్ను అరెస్టు చేసి, అతని మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకుంది. మే 16 నుంచి జూన్ 20వ తేదీ వరకు పాకిస్థాన్లోని ఓ మహిళకు ఇమామీ ఖాన్ 230కి పైగా మెసేజ్లు పంపాడని, ఇందులో సైన్యానికి సంబంధించిన రహస్య సమాచారం ఉందని ఆర్మీ ఇంటెలిజెన్స్ పేర్కొంది.
సమాచారం కోసం భారీ మొత్తంలో డబ్బు ఇస్తానని ఆ మహిళ అతడిని తన వలలో వేసుకుంది. ఆగ్రా కంటోన్మెంట్కు సంబంధించిన రహస్య సమాచారాన్ని పాకిస్థానీ మహిళతో పంచుకోవడమే కాకుండా రూర్కీ కార్యాలయం నుంచి పత్రాలను కూడా ఆమెకు పంపినట్లు ఆర్మీ ఇంటెలిజెన్స్ అధికారులు అనుమానిస్తున్నారు.
ఖాన్పై క్రిమినల్ కేసు నమోదు చేశామని, త్వరలో ఆర్మీని సంప్రదిస్తామని, చట్ట ప్రకారం ప్రాసిక్యూట్ చేస్తామని ఆగ్రా పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు ఖాన్ ఆర్మీ ఇంటెలిజెన్స్ కస్టడీలో ఉన్నాడు. అయితే ఈ కేసు దర్యాప్తు బాధ్యతను సబ్-ఇన్స్పెక్టర్ దేవేంద్ర పాల్కు అప్పగించారు.
More Stories
అమెరికా చట్టాలకు భారతీయ విద్యార్థులు లోబడి ఉండాలి
భారత ప్రభుత్వాన్ని కోర్టులో ఎక్స్ సవాల్
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లలో 24 మంది మావోలు హతం