రాజకీయ పార్టీల పేరుతో విరాళాలపై ఐటీ కొరడా

దేశవ్యాప్తంగా ఉన్న గుర్తింపు పొందని రాజకీయ పార్టీల కార్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. పన్నెండుకు పైగా రాష్ట్రాల్లోని పలు నగరాల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. కొన్ని పార్టీలు నిబంధనలు పాటించకుండా విరాళాలు స్వీకరించి ఆర్థికపరమైన అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. 

ఆదాయపు పన్ను (ఐటీ) మినహాయింపును క్లెయిమ్ చేసిన పార్టీలపై కేంద్ర ఎన్నికల కమిషన్ గత మే నెలలో చర్యలు తీసుకుంది. బోగస్ విరాళాలు, పన్నుల్లో మోసాలకు పాల్పడ్డారనే కారణాలతో 87 రాజకీయ పార్టీలను జాబితా నుంచి తొలగించింది. ఎన్నికల సంఘం నిర్ణయం ఆధారంగా బోగస్ క్లెయిములు చేశారనే సమాచారం, అనుమానం ఉన్న చోట్ల ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

కేవలం ఐటీ మినహాయంపు, ఎన్నికల సమయాల్లో సదుపాయాల కోసమే పార్టీలు రిజిస్ట్రేషన్ చేసుకుని ఆర్ధిక అవకతవకలకు పాల్పడుతున్నట్లు దుమారం చెలరేగిన నేపథ్యంలో ఐటీ అధికారులు రంగంలోకి దిగి సోదాలు చేపట్టారు. తీగ లాగితే డొంకంతా కదిలినట్లు ఎక్కడో దొరికిన ఆధారంగా పలు రాష్ట్రాల్లో తనిఖీలు చేయాల్సి వస్తోంది.

దీంతో తొలుత 7 రాష్ట్రాల్లో మొదలైన సోదాలు 12 రాష్ట్రాలకు పెరిగింది. దేశ వ్యాప్తంగా మరిన్ని రాష్ట్రాల్లో కూడా సోదాలు జరిగే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.  రాజకీయ పార్టీల ముసుగులో నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుతున్నట్లుగా వచ్చిన సమాచారం ఆధారంగా ఐటి శాఖ విచారణ చేపట్టింది. 

ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు రావడంతో పాటు.. ఈసీ కూడా చేసిన సిఫార్సుతో… సోదాలు జరుపుతున్నట్లు ఆదాయ పన్ను శాఖ వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీ, గుజరాత్, ఉత్తర్ప్రదేశ్, మహారాష్ట్ర, హరియాణా సహా పలు రాష్ట్రాల్లో సోదాలు జరుగుతున్నాయి. రాజకీయ పార్టీలతో పాటు… వాటితో అనుబంధం ఉన్న సంస్థలు, నిర్వాహకుల కార్యాలయాలు, నివాసాల్లో సోదాలు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. 

ఇప్పటి వరకు జరిపిన సోదాల్లో యూపీ సుల్తాన్ పూర్ కేంద్రంగా  కార్యకలాపాలు జరుపుతున్న అప్నా దేశ్ పార్టీ  వందల కోట్ల విరాళాలు సేకరించిందని గుర్తించారు. 3 సంవత్సరాలలో రూ. 380 కోట్ల విరాళాలు వచ్చినట్లు గుర్తించింది. ఆసక్తికర విషయం ఏంటంటే సుల్తాన్‌పూర్‌కు చెందిన గడియారాలు అమ్మే వ్యక్తి అప్నా దేశ్ పార్టీకి అధ్యక్షుడుగా ఉన్నట్లు గుర్తించారు.