పాక్‌లో హిందూ బాలికపై సామూహిక అత్యాచారం

పాకిస్థాన్ దేశంలో మరో దారుణం తాజాగా వెలుగుచూసింది. ఉచితంగా రేషన్ ఇస్తామని ఆశపెట్టి  ఓ హిందూ మైనర్ బాలికను నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లి మత్తుమందు ఇచ్చి ఆమెపై సామూహిక అత్యాచారం జరిపిన దారుణ ఘటన జరిగింది.

పాక్ దేశంలోని సింధ్ ప్రావిన్సు పరిధిలో ఉన్న సంఘార్ జిల్లా షహదాద్ పూర్ గ్రామానికి చెందిన 13 ఏళ్ల హిందూ బాలిక కూరగాయలు కొనేందుకు మార్కెటుకు వచ్చింది. అదే గ్రామానికి చెందిన ఖాలిద్ మాషి, బర్షేక్ మాషీలనే ఇద్దరు యువకులు బాలికకు ఉచితంగా రేషన్ ఇస్తామంటూ చెప్పి గ్రామం బయట నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లారు.

మత్తుమందు కలిపిన పానీయాన్ని బాలికతో తాగించి ఇద్దరు యువకులు ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. బాధిత బాలిక కుటుంబ సభ్యులు, గ్రామస్థులు నిందితులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఫిర్యాదు చేశారు.  వరదలతో అల్లాడుతున్న సింధ్ ప్రావిన్సులో మహిళలపై సహాయం పేరిట లైంగిక వేధింపులు సాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఉమర్ కోట్ జిల్లాలోనూ ఉచిత రేషన్ ఇస్తామంటూ ఇద్దరు హిందూ మహిళలపై కూడా అత్యాచారం జరిగిందని సమాచారం.

సింధ్ ప్రావిన్సులో 4 రోజుల క్రితం 8 ఏళ్ల బాలికకు కళ్లు గప్పి ఆమెపై అత్యాచారం చేసిన ఘటన వీడియో కూడా సోషల్ మీడియాలో వెలుగుచూసింది.ఈ ఘటన సంచలనం రేపింది. గతవారం పాకిస్థాన్ లో 21 ఏళ్ల అమెరికన్ బ్లాగరుపై సామూహిక అత్యాచారం జరిగింది.

మరోవంక, పాకిస్థాన్ లోని లాహోర్ నగరంలో స్విమ్మింగ్‌పూల్‌కు వెళ్లిన 10 ఏళ్ల మైనర్ బాలికను స్విమ్మింగ్‌పూల్ యజమాని, అతని సన్నిహితులు అత్యాచారం చేయడమే కాక, హత్య చేసిన సంఘటన బయట పడింది. దీనిపై బాధితురాలి కుటుంబ సభ్యులతోపాటు భారీ ఎత్తున జనం పంజాబ్ అసెంబ్లీ బయట మంగళవారం నిరసన ప్రదర్శించారు. 

నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పౌర సమాజం సభ్యులు, ఎన్‌జీవొలు ఈ నిరసనలో పాల్గొన్నారు. దోషులను బహిరంగంగా ఉరి తీయాలని డిమాండ్ చేశారు. నిరసన స్థలం వద్దకు సీనియర్ పోలీస్ అధికారులు చేరుకుని దోషులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చి ఆందోళనను విరమింప చేశారు. 

ఈ ఘోర సంఘటనతో సంబంధం ఉందని భావిస్తున్న ఇద్దరిని అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు. బాధితురాలు సుర్రన్ వ్యాలీ లోని మొహ్మద్ జిల్లా గిరిజన ప్రాంతం పాష్తూన్ కుటుంబానికి చెందింది. సెంట్రల్ లాహోర్ లోని మనవాన్ ప్రాంతంలో గల స్విమ్మింగ్‌పూల్‌కు తన సోదరునితో కలిసి వెళ్లింది. ఆ స్విమ్మింగ్ పూల్ యజమాని అలీ రజా, అతని సన్నిహితులు కలసి తన కుమార్తెపై సామూహిక అత్యాచారం చేశారని, తరువాత హత్య చేశారని ఆమె తండ్రి తాజ్ ముహమ్మద్ ఆరోపించారు.

పాక్ దేశంలో 157 మంది మహిళలు ఇటీవల కిడ్నాప్ కాగా వారిలో 112 మందిపై అత్యాచారం జరిగిందని వెల్లడైంది.ఈ ఏడాది ఒక్క జూన్ నెలలోనే 180 మంది బాలికలపై అత్యాచారం జరిగింది. సింధ్, ఇస్లామాబాద్, ఖైబర్ ఫక్తూన్ ఖవా, బలోచిస్థాన్ ప్రాంతాల్లో మహిళలపై అత్యాచారాల ఘటనలు జరిగాయి.