రాష్ట్రవ్యాప్తంగా నైజాం విముక్త అమృతోత్సవాలు

ఏడాదంతా నైజాం విముక్త అమృతోత్సవాలు నిర్వహిస్తున్నామని నైజాం విముక్త స్వతంత్ర అమృతోత్సవ్ కమిటీ గౌరవ  అధ్యక్షుడు, మాజీ పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి  జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి తెలిపారు. నైజాం విముక్త స్వతంత్ర అమృతోత్సవ్ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ  రాజకీయాలకు అతీతంగా, ప్రజల భాగస్వామ్యంతో, ఎలాంటి డిమాండ్లు లేకుండా, చరిత్ర పట్ల యువతను జాగృతపరచడానికి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 

ఇదే సందర్భంగా 28 మందితో కూడిన రాష్ట్ర కమిటీని ప్రకటించారు. కమిటీలో గౌరవ అధ్యక్షులుగా జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి అధ్య‌క్షులుగా శ్రీ డాక్టర్ వంశీ తిలక్ గారు, ఉపాద్యక్షులుగా విశ్రాంత ఐఎఎస్ అధికారి చామర్తి ఉమామహేశ్వరరావు, విశ్రాంత కార్మిక శాఖ కమిషనర్ హెచ్.కె.నాగు, ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు విభాగం విశ్రాంత శాఖాధిపతి ప్రొఫెసర్ కసిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. కమిటీలో కార్యదర్శిగా మాజీ ఎంపీ వివేక్ సతీమణి సరోజ కూడా ఉన్నారు.

“దేశ వ్యాప్తంగా స్వాతంత్ర్యం వచ్చినా తెలంగాణ ప్రజలకు ఆనాడు స్వాతంత్ర్యం రాలేదు. ఏడాది తర్వాత తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చింది. సాయుధ పోరాట ఫలితంతో తెలంగాణ ప్రజలకు విముక్తి లభించింది. ఈ ఉత్సవాల ఉద్దేశ్యం ఇతర మతాలను రెచ్చగొట్టేందుకు కాదు. స్వాతంత్య్రం కోసం ప్రాణాలు అర్పించిన వారిని స్మరించుకోవడం కోసం మాత్రమే” అని నరసింహారెడ్డి స్పష్టం చేశారు. 

హైదరాబాద్ కు స్వతంత్ర చరిత్ర తెలిసినా ..తెలంగాణ గ్రామాల్లో చాలామందికి తెలియదని చెబుతూ అందుకే ఏడాది పొడవున నైజాం విముక్త అమృతోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ ఒక్కటే కాదు కొన్ని గ్రామాలు మహారాష్ట్ర, కర్నాటక లాంటి రాష్ట్రాల్లో తెలంగాణ గ్రామాలు కొన్ని ఉన్నాయని పేర్కొంటూ  సామాజిక సేవకులు, సాహిత్య కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. 

జిల్లాల్లో, మండలాలు, గ్రామాల్లో ఉన్న ఆనాటి వ్యక్తులతో పోరాటాలకు సంబంధించిన విషయాలపై చర్చలు ఉంటాయి. సెప్టెంబర్ 17న అన్ని రెవెన్యూ మండలాల్లో జెండా ఆవిష్కరణ. నవంబర్ లో యువ సమ్మేళనాలు. జనవరి డోర్ టూ డోర్ జన జాగరణ. ఫిబ్రవరిలో మేధావులతో సమావేశాలు జరపాలని నిర్ణయించారు.  

వచ్చే ఏడాది సెప్టెంబర్ 17న ఊరూరా జెండా, ఇంటింటికి జెండా కార్యక్రమం జరుపుతారు.  కేంద్ర ప్రభుత్వం నిర్వహించే సమావేశానికి, తమ  సమావేశాలకు ఎలాంటి సంబంధం లేదని, రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.