అమిత్ షా సమక్షంలో బిజెపిలో చేరిన రాజగోపాల్ రెడ్డి

మునుగోడు వేదికగా అమిత్ షా సమక్షంలో మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ బిజెపి పార్టీ లో చేరారు. మునుగోడు ఎమ్మెల్యే పదవికి , కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసిన రాజగోపాల్..ఈరోజు కేంద్ర మంత్రి అమిత్ షా సమక్షంలో కాషాయం కండువా కప్పుకున్నారు. అమిత్ షా కాషాయ కండువా కప్పి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు.

మునుగోడులో ధర్మం గెలుస్తుందని, కేసీఆర్ పతనం అక్కడి నుంచే ప్రారంభమైతదని ఈ సందర్భంగా ప్రసంగిస్తూ రాజగోపాల్ రెడ్డి భరోసా వ్యక్తం చేశారు. న్నారు. రాష్ట్రం మోసకారి, దగా కోరు, నయవంచక కుటుంబం చేతిలో చిక్కి విలవిల్లాడుతోందని ఆరోపించారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని  రాజగోపాల్ పిలుపిచ్చారు.

ప్రజల మీద విశ్వాసంతోనే పదవికి రాజీనామా చేశానన్న ఆయన.. తనను గెలిపించిన ప్రజలకు న్యాయం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ ను గద్దె దింపి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాల్సిన అవసరం ఉందని రాజగోపాల్ స్పష్టం చేశారు.  ‘‘అమ్ముడుపోయే వ్యక్తిని కాదు నేను. మునుగోడు ప్రజల తలదించుకునే పని ప్రాణం పోయినా చేయను’’ అని ఆయన పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో సమానత్వం కోసం యుద్ధం జరుగుతోందని చెప్పారు.

రాష్ట్రంలో కుటుంబ పాలనకు వ్యతిరేకంగా యుద్దం జరుగుతోందని చెబుతూ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎన్నిసార్లు సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ కోరినా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మునుగోడు ఉప ఎన్నిక వ్యక్తుల మధ్య జరిగే యుద్ధం కాదని, కేసీఆర్ అహంకారానికి తెలంగాణ ప్రజల మధ్య జరుగుతున్న యుద్ధమని రాజగోపాల్ చెప్పారు. ప్రజలు చారిత్రక తీర్పు ఇచ్చి టీఆర్ఎస్ను బొందపెట్టాలని రాజగోపాల్ పిలుపునిచ్చారు.

పార్టీలు మారేటప్పుడు చాలా మంది నేతలు నైతిక విలువలు వదిలేస్తున్నారని కానీ తాను మాత్రం పదవికి రాజీనామా చేసి మరీ బీజేపీలో చేరానని రాజగోపాల్ చెప్పారు. బాయిల కాడ మోటర్లకు మీటర్లు పెడ్తరని రైతులను కేసీఆర్ బెదిరిస్తున్నడని మండిపడ్డారు. తాను అమిత్ షాను కలిసి వచ్చిన నాటి నుంచి కేసీఆర్ కు నిద్రపడ్తలేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో పాలన అవినీతిమయంగా మారిందన్న రాజగోపాల్ కేసీఆర్ దోచుకున్నదంతా కక్కిస్తామని హెచ్చరించారు.