మిషన్ భగీరథ అట్టర్ ఫ్లాప్

హర్ ఘర్ జల్ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీద టీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రచారాన్ని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు మిషన్ భగీరథ ద్వారా రాష్ట్రంలో ఇప్పటికీ వేలాది గ్రామాలకు ఇంటింటికీ మంచి నీళ్లు సరఫరా చేయలేకపోయినప్పటికీ 100 శాతం నీళ్లిస్తున్నట్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రచారం చేసుకోవడం సిగ్గు చేటని మండిపడ్డారు. 
 
 అట్టర్ ఫ్లాప్ మిషన్ భగీరథ స్కీంను దేశంలోనే నెంబర్ వన్ గా గుర్తించాలని చెప్పడం హాస్యాస్పదం అంటూ ఎద్దేవా చేశారు.  గాలి మాటలు చెప్పడంలో, పచ్చి అబద్దాలను ప్రచారం చేయడంలో, ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం వాళ్లకు వాళ్లే సాటి అని విమర్శించారు. హర్ ఘర్ జల్ పేరిట జల్ జీవన్ మిషన్ ప్రవేశపెట్టిన స్కీంను వంద శాతం అమలు చేసిన గోవా పేరును ప్రధాని మోదీ చెప్పగానే వీళ్లకు ఎక్కడా లేని కోపం పుట్టుకొచ్చిందంటూ ధ్వజమెత్తారు.
 
ఇన్నాళ్లూ రాష్ట్ర ప్రజలను మోసం చేసినట్లుగానే కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసి బొక్కబోర్లా పడ్డారని సంజయ్ స్పష్టం చేశారు. ప్రధాని గోవా ఫస్ట్ అంటే.. కాదు కాదు.. 100 శాతం గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా నీళ్లిచ్చిన తెలంగాణే రాష్ట్రమే ఫస్ట్ అని ప్రగల్భాలు పలికారని చెప్పారు. 
 
• కానీ ‘హర్ ఘర్ జల్’ పథకం కింద రాష్ట్రంలోని 100 శాతం కుటుంబాలకు మంచి నీటి కనెక్షన్లు ఇచ్చినట్లు గుర్తించాలంటే దానికి ప్రత్యేక మార్గదర్శకాలున్నాయని హితవు చెప్పారు. రాష్ట్రంలోని 100 శాతం గ్రామాలు గ్రామ సభలు నిర్వహించాలని, అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు సమావేశమై తాము 100 శాతం నల్లా కనెక్షన్లు ఇచ్చినట్లు తీర్మానాలు చేసి పంపితే అది ‘సర్టిఫైడ్ స్టేట్’ గా గుర్తిస్తారని తెలిపారు. 
 
భారత దేశంలో సర్టిఫైడ్ లిస్ట్ లో స్టేట్/యూటీ జాబితాలో కేవలం గోవా, దాద్రానగర్ హవేలి, డామన్ డయ్యు మాత్రమే ఉన్నాయని స్పష్టం చేశారు. తాము ఇస్తున్నామని రిపోర్ట్ చేసిన రాష్ట్రాలు/కేంద్రపాలిత రాష్ట్రాల లిస్టులో తెలంగాణతోపాటు అండమాన్ నికోబార్, పుదుచ్చేరి, హర్యానా రాష్ట్రాలున్నాయని చెబుతూ కావాలంటే జల్ జీవన్ మిషన్ వెబ్ సైట్లో ఈ వివరాలు తెలుసుకోవచ్చని సంజయ్ చెప్పారు.
 
కానీ రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, మున్సిపాలిటీల్లో ప్రతి ఇంటికీ నల్లా నీళ్లు ఇస్తున్నట్లు తీర్మానం చేయించి పంపే దమ్ముందా?  అంటూ సంజయ్ సవాల్ చేశారు.